తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ అమర్చేందుకు మీటర్ల ఖర్చుతో పాటు కొంత అడ్వాన్స్ కలిపి రూ.8,687 నెల రోజుల్లో చెల్లించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందుకు తగినన్ని నిధులను విద్యాశాఖ మంజూరు చేయకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలుండటంతో ఇప్పటికే వందలాది బడులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని.. ఇప్పుడు స్మార్ట్ మీటర్లుకు నిధులు ఎక్కడ నుంచి తీసుకురావాలని వారు తలలుపట్టుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2016లో నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ఇచ్చింది రూ.6 వేలే..
ఇటీవల పాఠశాల విద్యాశాఖ స్కూల్ గ్రాంట్ను విడుదల చేసింది. రూ.6 వేల చొప్పున అందిన బడులు దాదాపు 15 వేలు ఉండటం గమనార్హం. ఇప్పుడు స్మార్ట్ మీటర్కు రూ.8,687 చెల్లించాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.