ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొవిడ్ బాధితులకు ఆనందయ్య ఇచ్చిన ఔషధంపై… సీసీఆర్ఏఎస్ పరిశోధన రెండో రోజు కొనసాగుతోంది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి ఆయుర్వేద కళాశాల బృందాలు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల వారు నిన్న ఒక్కరోజే… మందు వాడిన 190 మంది నుంచి వివరాలు సేకరించారు. ఫోన్ల ద్వారా సమాచారం సేకరించటంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఔషధం తీసుకున్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.