గత ఏడాది హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది వేల డెంగీ, మలేరియా, టైపాయిడ్ కేసులు వచ్చాయి. దీంతో సంబంధిత ఆస్పత్రి రోగులతో కిటకిటలాడిపోయింది. ఈ ఏడాది పరిస్థితి గత ఏడాదంత తీవ్రంగా లేకపోయినా కూడా గత కొద్ది రోజులుగా కేసులు సంఖ్య పెరిగింది. ఇప్పటికే 30 మంది వరకు వివిధ రకాల వ్యాధులతో ఈ ఆస్పత్రిలో చేరి వైద్యం పొందుతున్నారు. పగటిపూట దోమకాటుకు గురైతే సంబంధిత వ్యక్తికి డెంగీ వచ్చే అవకాశం ఉంది. చారలతో ఉండే దోమలు పగటిపూట అధికంగా సంచరిస్తాయి. ఈ దోమ కాటుకు ఎంతమంది గురైతే అంతమంది డెంగీ బారినపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. రాత్రిపూట సంచరించే దోమల బారినపడితే సంబంధితులకు టైపాయిడ్, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఈ లక్షణాలుంటే డెంగీనే!
డెంగీ బారినపడే వారిలో జ్వరం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. కొందరిలో 103, 104 టెంపరేచర్ ఉంటుంది. తలనొప్పి చాలా తీవ్రస్థాయిలో వస్తుంది. ప్రధానంగా కనుగుడ్లు అటూఇటూ తిప్పినపుడు ఓర్చుకోలేని నొప్పి వస్తే మాత్రం సంబంధిత వ్యక్తి డెంగీ వ్యాధికి గురయ్యారని చెప్పవచ్చని సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. ఒళ్లు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటుంది. విరోచనాలు, వాంతులు కూడా అధికంగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుని చికిత్సను పొందాలి. లక్షణాలు తీవ్రంగా ఉండి నాలుగైదు రోజులపాటు నిర్లక్ష్యంగా ఉంటే ప్లేట్లెట్స్ మెల్లగా పదివేలకు తగ్గిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అప్పుడు కూడా వైద్యం అందించపోతే ప్రాణాలకు మీదకు వస్తోందని వైద్యులు చెబుతున్నారు.
కంటితుడుపుగానే కట్టడి
గ్రేటర్లో దోమల సమస్య నానాటికీ పెరుగుతోంది. ప్రజలు రోగాలబారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా జీహెచ్ఎంసీ సరైన చర్యలు తీసుకోవట్లేదు. క్షేత్రస్థాయి సర్వేతో సమస్యాత్మక ప్రాంతాలను, హాట్ స్పాట్లను గుర్తించినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు నామమాత్రంగా ఉండమే అందుకు నిదర్శనం.
చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించట్లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎప్పటికప్పుడు గుర్రపుడెక్క తొలగించే ఏజెన్సీలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎంపిక చేసుకున్నాయి. బిల్లులూ చెల్లిస్తున్నాయి. గుత్తేదారులు మాత్రం గుర్రపుడెక్కను అలాగే వదిలేశారు.