తెలంగాణ

telangana

ETV Bharat / city

అప్పు పుట్టని దైన్యం... ఆర్టీసీ కార్మికుల జీవితం దయనీయం!

ఆర్టీసీ కార్మికుల బతుకు అర్ధాకలితో కొట్టుమిట్టుకుంటోంది. ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, నిత్యావసరాలకు కటకటలాడాల్సి వస్తోంది. చేబదుళ్లతో కొందరి జీవితం గడుస్తోంది. అప్పు పుట్టని వారి అవస్థలు వర్ణనాతీతం! ఉద్యోగం వస్తుందో రాదో తెలియక... ఆత్మహత్యలు కొన్ని.. ఆగుతున్న గుండెలు మరికొన్ని!? ఈ కన్నీటి రోదనకు పరిష్కారం ఎప్పటికో!

By

Published : Nov 25, 2019, 8:36 AM IST

RTC workers life has turned miserable

ప్రగతి చక్రాలపై నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు పరుగులు తీయించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు అచేతనంగా మిగిలారు. సమ్మెలో ఉన్న వారి కుటుంబాలు అర్ధాకలితో పస్తులుంటున్నాయి. కార్మికులు విధులకు దూరమై 51 రోజులు గడిచిపోయాయి. మళ్లీ విధుల్లోకి వెళ్లగలరో లేదో తెలియదు. ఒక్క నెల జీతం రాకపోతేనే విలవిలలాడే బతుకులవి. ఏకంగా రెండు నెలలుగా జీతాల్లేక జేబులు నిండుకున్నాయి. చేబదుళ్లతో నెట్టుకొస్తున్నారు. అవి కూడా దొరకని వారు సొమ్ములు లేక సొమ్మసిల్లుతున్నారు.

ఆత్మహత్యలు.. ఆగుతున్న గుండెలు

ఒకవైపు ఆత్మహత్యలు, మరోవైపు దిగులు మరణాలతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు ఆవరించాయి. ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, పాలు, వెచ్చాలు... ఇలా దేనికీ డబ్బుల్లేవు. అప్పులిచ్చేవాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం అన్నది ప్రశ్నార్థకమే.

జీతం లేక... జీవితం దక్కక..

నాగేశ్వర్‌ అనే కండక్టర్‌ ఇటీవల మనోవేదనతో మృతి చెందారు. ఆయన భార్య సుజాత, ఇద్దరు కుమారులు వీరు. తన భర్త దూరమైన వైనాన్ని సుజాత కన్నీళ్లతో ఏకరువు పెట్టారు... ‘ఉద్యోగం ఉంటుందా? లేదా? అన్న మనోవేదనతో ఆయన మంచాన పడ్డారు. నిద్రలో టికెట్‌...టికెట్‌ అని కలవరించేవారు. నారాయణ్‌ఖేడ్‌లో ఉండేవాళ్లం. జీతం లేక జోగిపేటకు మకాం మార్చాం. ఆయనను తార్నాక ఆస్పత్రికి తీసుకెళ్తే సమ్మెలో ఉన్నందున వైద్యం చేయబోమన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేర్చితే రెండు రోజులకు చనిపోయారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోతే యూనియన్‌ నాయకులు సాయం చేశారు. నేను, ఇద్దరు కుమారులు రోడ్డున పడ్డాం. చదువు మానేసిన కొడుకు మోటారు సైకిల్‌ మెకానిక్‌ షాపులో పని చేస్తున్నాడు’ అని వాపోయారు.

దిక్కుతోచని స్థితిలో కండక్టర్‌ నాగేశ్వర్‌ కుటుంబం

48 వేల మంది భవితవ్యం.. ప్రశ్నార్థకం!

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. నవంబరు కూడా గడిచిపోతుండడంతో సగటు కార్మికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

  • పిల్లల చదువులు ఆగిపోయాయి

- ఎం.పుష్పలత, కండక్టర్‌, వరంగల్‌

  • డబ్బుల్లేక పిల్లల ఫీజులు చెల్లించలేకపోయాం. ఇద్దరు పిల్లలూ దసరా సెలవుల తరువాత నుంచి కాలేజీలకు వెళ్లట్లేదు. చదువులు ఆగిపోయాయి. చిరుద్యోగైన నా భర్త జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. రెండు నెలలుగా ఇంటి అద్దె తదితరాలేవీ చెల్లించలేదు. ఉద్యోగం ఏమవుతుందోనన్న ఆందోళనతో నాకు అనారోగ్యం సోకితే... వైద్యానికి రూ. అయిదు వేలు ఖర్చయ్యింది. మళ్లీ ఉద్యోగంలోకి వెళ్తామా? జీతం వస్తుందా? అనే ఆందోళనతో ఉన్నాం.
    ఎం.పుష్పలత, కండక్టర్‌, వరంగల్‌

సమ్మె విరమిస్తామని చెప్పినా..

సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల ఐకాస ప్రకటించి నాలుగు రోజులవుతున్నా ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించలేదు. కార్మికుల ఆత్మహత్యలు, జీతాల చెల్లింపు వ్యవహారాల్లో హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు కొలిక్కి వచ్చాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగంలోకి ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా? అని కార్మికులు ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి...'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details