రాజకీయ కోణంలోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయజెండా ఎగురవేసి కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు. సర్ధార్ వల్లాభాయి కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రేవంత్ అన్నారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
'ఆనాడు హైదరాబాద్కు స్వాతంత్ర్యం ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ. నిజాం పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పోరాడింది. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తెలంగాణ అంటేనే కాంగ్రెస్. కమ్యూనిస్టులతో కలిసి భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేశారు. చరిత్రను నేడు కొందరు వక్రీకరిస్తున్నారు. ఆనాడు 563 సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. గుజరాత్లోని జునాఘడ్లో వేడుకలు ఎందుకు జరపట్లేదు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు. నెహ్రూ ఆదేశాల మేరకే పటేల్ హైదరాబాద్ను విలీనం చేశారు. స్వాతంత్ర్య, సాయుధ పోరాట సమయానికి భాజపా అసలు పుట్టలేదు.' రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛ అని అన్నారు. అమరులు, వీరులను స్మరించుకుంటూ.. వారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బైరాన్పల్లి ఘటనలు తెలంగాణలో చాలా జరిగాయని తెలిపారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం దండు కట్టిండ్రు.. దళంగా కదిలిండ్రు అని గుర్తుచేశారు. దేశం, రాష్ట్రానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది.. కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17 ఉత్సవాలు చేయని తెరాస సర్కార్కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. 1950లో గాంధీ భవన్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పునాదులు వేశారన్నారు. పటేల్కు పూలదండ వేసే నైతిక హక్కు కూడా భాజపాకు లేదని అన్నారు.