తెలంగాణ

telangana

Bandi sanjay: 'ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఏంచెప్పారో గుర్తుచేసుకోవాలి'

తెలంగాణ ఎందుకు ఏర్పాటైందని బాధపడే పరిస్థితి వచ్చిందని..భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఆ పార్టీ నేతలు డీకే అరుణ, విజయశాంతితో కలిసి.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్​.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ మళ్లీ గాడిలో పడాలంటే భాజపా అధికారంలోకి రావాలని విజయశాంతి ఆకాంక్షించారు.

By

Published : Jun 2, 2021, 12:16 PM IST

Published : Jun 2, 2021, 12:16 PM IST

telangana formation day celebrations
భాజపా కార్యాలయంలో తెలంగామ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అమర వీరుల ఆశయాలు నెరవేరాలంటే.. అది కేవలం భాజపా వల్లే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భాజపా మద్దతు వల్లే రాష్ట్రాన్ని సాధించగలిగామన్నారు. ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలు నెరవేరటం లేదని ప్రజలు బాధపడుతున్నారని బండి సంజయ్​ అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఏం చెప్పారో మరోసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ఎందుకు వచ్చిందనే బాధపడే పరిస్థితిని తెరాస కల్పించిందని విమర్శించారు. ఒక్క కుటుంబం సంతోషం కోసమే తెలంగాణ వచ్చిందా అనే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

కరోనా విపత్కర కాలంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సంజయ్​ ఆరోపించారు. సర్కారుపై ఆధారపడకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రాణాలను పణంగా పెట్టి... భాజపా నేతలు ప్రజలకు సేవచేస్తున్నారని సంజయ్​ పేర్కొన్నారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఏంచెప్పారో గుర్తుచేసుకోవాలి

ఉద్యమకారులెవరూ కేసీఆర్​ పక్కన లేరు..

నాడు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారెవరూ.. ఇప్పుడు కేసీఆర్​ పక్కన లేరని.. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఉద్యమనేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

భాజపా మద్దతు ఇవ్వడంతోనే.. రాష్ట్రం ఏర్పాటైందన్న అరుణ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో దివంగత సుష్మా స్వరాజ్​ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెరాస పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని.. తెలంగాణలో ప్రజాస్వామ్యహిత పాలన రావాలని డీకే అరుణ ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ .. అమరవీరుల త్యాగాలను మర్చిపోయారని ఆమె విమర్శించారు. 2018లో శంకుస్థాపన చేసిన అమరవీరుల స్థూపం నేటి పూర్తికాలేదన్నారు. రూ.80 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.100 కోట్లకు పెంచినా.. పనులు పూర్తికాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే రోజు రావాలంటే భాజపా అధికారంలోకి రావాలని డీకే అరుణ అన్నారు.

గాడిలో పడాలంటే భాజపా రావాలి!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆలోచన.. తొలుత భాజపాకే వచ్చిందని.. ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా మాత్రమే ఏర్పాటైందన్నారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నారు.

తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని.. మానసిక బాధతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు విజయశాంతి. రాష్ట్రంలోని విద్యారంగం కోమాలో.. వైద్య రంగం వెంటిలేటర్​పై ఉన్నాయని విమర్శించారు. గాడి తప్పిన తెలంగాణలో అద్భుతమైన పాలన రావాలంటే.. భాజపా అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని సమస్యలపై కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఉద్యమం ప్రారంభిస్తామని విజయశాంతి వెల్లడించారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details