తెలంగాణ

telangana

'రైతుబంధు సాయంలో చిన్నరైతులకు ప్రాధాన్యం'

By

Published : Jun 16, 2020, 4:16 PM IST

వారం, పదిరోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలనుకునేవారు అధికారులకు గివ్​ ఇట్​ అప్​ ఫాం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

regulations release for farmer financial assistance
'రైతుబంధు సాయంలో చిన్నరైతులకు ప్రాధాన్యం'

రైతుబంధు పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పదిరోజుల్లోగా రైతుబంధు సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమచేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు... వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. బడ్జెట్ రూపకల్పన సమయంలో 2020 జనవరి 23న సీసీఎల్ఏ సంచాలకులు ఇచ్చిన వివరాల్లోని పట్టాదార్లకు రైతుబంధు వర్తిస్తుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదార్లు, పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న 621మంది పట్టాదార్లకు కూడా రైతుబంధు సాయం అందుతుందని స్పష్టం చేసింది.

మధ్యలో చేర్పులుండవ్...

ఆర్థిక సంవత్సరంలో ఒకమారు సీసీఎల్ఏ సంచాలకుల నుంచి వివరాలు తీసుకొని వాటి ఆధారంగా రైతుబంధు సాయాన్ని అందించనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. ప్రతి సీజన్​కు ముందు భూముల లావాదేవీలు పరిశీలించి అమ్మిన భూములు జాబితా నుంచి తొలగించనున్నారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో పట్టాదార్ల తొలగింపులు ఉంటాయి గానీ... చేర్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఏడాదిలోనే రైతుబంధు సాయం అందుతుందని తెలిపింది.

స్వచ్ఛందంగా వదులుకోవచ్చు

ఆర్థికశాఖ నుంచి దశల వారీ నిధుల విడుదలలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఉంటుందన్న ప్రభుత్వం... అందుకు అనుగుణంగానే బిల్లులు రూపొందించాలని సూచించింది. రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... 30 రోజుల్లోగా ఫిర్యాదులు పరిష్కరించాలని చెప్పింది. రైతుబంధు సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకునే వారు వ్యవసాయ అధికారులకు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. గివ్ ఇట్ అప్ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. గివ్ ఇట్ అప్​పై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించింది.

ఇదీ చూడండి:రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details