Protest: ఆంధ్రప్రదేశ్లో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని రీ-పోస్టుమార్టం తర్వాత పోలీసులు మృతదేహాన్ని అడ్డదారిలో తరలించడంతో గోరంట్లలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని అడ్డదారిలో తరలించడంపై పోలీసులను నిలదీశారు. మృతురాలి తరఫు బంధువులు తేజస్విని మృతికి కారకుడైన సాధిక్ ఇంటి తలుపులు పగులగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సాధిక్ ఇంటి వద్దకు చేరుకొని బంధువులను పంపించేశారు. అనంతరం మృతురాలి కుటుంబానికి సంబంధించిన పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
వాల్మీకి సంఘ నాయకుల ఆందోళన:తేజస్విని అనుమానాస్పద మృతిపై తెదేపా నేతలు, వాల్మీకి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, వాల్మీకి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వాల్మీకి సంఘాల నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు.
అసలేం జరిగిందంటే..?:తిరుపతిలో బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడుగా చెబుతున్న సాధిక్కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగు చూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి.. తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.