తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2022, 12:52 PM IST

ETV Bharat / city

గ్రేటర్ పరిధిలో ఆస్తుల రిజిస్ట్రేషన్​తో పాటే ఆస్తి పన్ను మదింపు..

Property tax assessment: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల రిజిస్ట్రేషన్​తో పాటు ఆస్తి పన్ను మదింపు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఎంత విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అంతే స్థలానికి ఆస్తి పన్ను విధించేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో పౌరులకు చాలా మేలు కలుగుతోందని.. సమయం, డబ్బు ఆదా అవునున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ దస్త్రాలను తీసుకుని బల్దియా చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం నివాస గృహాలు, సముదాయాలకు కొత్త విధానం అమల్లోకి తెచ్చామని.. రానున్న రోజుల్లో వాణిజ్య భవనాలు, సముదాయాలకూ వర్తింపజేస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది.

Property tax assessment along with property registration in GHMC
Property tax assessment along with property registration in GHMC

Property tax assessment: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పాత ఆస్తి పన్ను అసెస్​మెంట్ విధానం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. తరచూ జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. సిబ్బంది కొరత మూలంగా అసెస్​మెంట్ పక్రియ సకాలంలో పూర్తికాలేక ప్రజలు అవస్థలు పడేవారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు.. వంద శాతం అసెస్​మెంట్​ వేగవంతంగా పూర్తయ్యేందుకు.. ఆస్తులను టాక్స్​నెట్ పరిధిలోకి తీసుకురావడం కోసం కొత్త ఆన్​లైన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. కొత్తగా ఇచ్చే నిర్మాణ అనుమతుల్లో వ్యక్తిగత గృహాల నుంచి భవన, వాణిజ్య సముదాయాలుంటాయి. నిర్మాణ దారులు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు.

ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయ్యాక.. ఆ పత్రాలను బల్దియా అధికారులకు ఇస్తే ఆస్తిపన్ను విధించేవారు. సిబ్బంది కొరతతో ఆస్తి అసెస్​మెంట్ సెల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి ఆస్తి మదింపునకు నెల నుంచి రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఐదేళ్ల కిందట స్వీయ మదింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. యజమానులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గ్రేటర్​లో మొత్తం నిర్మాణాలు 17.5 లక్షలు... ఏటా ఇచ్చే నిర్మాణ అనుమతులు 16 వేలు వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం, ధరణి విధానాలను బల్దియాకి వర్తింపజేసింది. చట్టసవరణ ద్వారా రిజిస్ట్రేషన్​తో పాటు మ్యుటేషన్ జరిగేలా చేసింది. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ మరో అడుగు ముందుకేసి, కొత్తగా కొనే ఇళ్లకు.. రిజిస్ట్రేషన్​తో పాటే ఆస్తిపన్ను ఖాతా సంఖ్యను ఇచ్చి, విస్తీర్ణానికి తగ్గట్లు పన్ను విధిస్తోంది. ఇందుకు సబ్​రిజిస్ట్రార్లకు న్యూఅసెస్​మెంట్ అనే ఐచ్ఛికాన్ని ఇచ్చింది. ఆ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

ఆస్తిపన్ను మదింపు ప్రక్రియలో కొందరు జీహెచ్ఎంసీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ.. స్వయంగా కొత్త ఆస్తులకు పన్ను వేస్తోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆస్తిపన్ను మదింపు అద్దె విలువ ఆధారంగా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ అయిన పాత ఆస్తికి గతంలోని ప్రాపర్టీ టాక్స్ పీటీ నెంబర్, వేకెంట్ ల్యాండ్ నెంబర్ ఆటోమేటిక్​గా అదే నెంబర్​తో నూతన యజమాని పేరిట నమోదవుతుంది. కొత్త ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అసెస్మెంట్ కానీ పక్షంలో ఆస్తి పన్నుకు, ఖాళీ స్థలానికి జీహెచ్ఎంసీ నూతనంగా ఆస్తి పన్ను ఐడెంటిఫికేషన్, వేకేంట్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్​లను కేటాయిస్తారు. నూతన ఆస్తి పన్ను, వేకెంట్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్​లను జారీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్​లో సూచించిన ఆస్తి విలువ ప్రకారంగా.. ఆస్తి పన్ను అసెస్​మెంట్, ఖాళీ స్థలం పన్ను అసెస్మెంట్​ను నిర్ధరణ చేస్తారు.

నివాస గృహాలకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు ఫీట్​కు రూ.1.25 పైసల చొప్పున... మిగతా ప్రాంతాలకు రూపాయి చొప్పున ఆస్తి పన్ను వేస్తున్నారు. వేకెంట్ ల్యాండ్​కు రిజిస్ట్రేషన్ విలువలో 0.50 శాతం పన్ను వేస్తున్నారు. ఆస్తి పన్ను అసెస్​మెంట్ చేసిన తర్వాత సంబంధిత అభ్యర్థి మొబైల్ నెంబర్​కు రెండు లింకులతో కూడిన మెస్సేజ్​లు పంపుతున్నారు. మొదటి లింక్ ద్వారా అసెస్మెంట్ వివరాల కాపీ, రెండో లింక్ ద్వారా ఆస్తిపన్ను చెల్లింపు ఉత్తర్వు ప్రకారంగా నిర్థరించిన పన్ను చెల్లించాలి. ఈ నూతన పద్ధతి ద్వారా మానవ ప్రమేయం లేకుండా పారదర్శకంగా తక్షణమే వివరాలు పొందే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:యాదాద్రిలో నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ.. ఏక కాలంలో ఏడు గోపురాలకు..

ABOUT THE AUTHOR

...view details