రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ... 50 శాతం ఇంఛార్జి పాలనలోనే కొనసాగుతోంది. సరిపడినంత మంది సబ్ రిజిష్ట్రార్లు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇంఛార్జిలుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు మరో 20 మంది సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ కార్యాలయాల్లో మొత్తం 170 మంది ఉండాల్సి ఉండగా అందులో 70కి పైగా ఖాళీ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలల్లో 50 నుంచి 60 ఇంఛార్జిల పాలనాలో కొనసాగుతున్నాయి.
త్వరలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఇన్ఛార్జిల పాలనకు అడ్డుకట్ట
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో ఇంఛార్జి పాలనకు త్వరలో అడ్డుకట్ట పడనుంది. సబ్రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్ల వరకు పదోన్నతుల కల్పన ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల మూడో వారంలో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టె శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదోన్నతులకు చెందిన డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ- డీపీసీలు పూర్తి అయ్యాయి. అర్హులైన సీనియర్, జూనియర్ సహాయకులకు 25 మందికి పదోన్నతులు కల్పించారు. మరో 23 మందిని రిక్రూట్ ద్వారా మొత్తం 48 మందిని సబ్ రిజిస్ట్రార్లుగా నియమించనున్నారు. 22జిల్లా రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. మరో 8 మందిని పదోన్నతులు ద్వారా నియమకాలు చేయనున్నారు. ఇంకో ఆరు రిక్రూట్ ద్వారా భర్తీ చేస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. మూడో వారంలో పదోన్నతులకు చెంది ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తవగానే... రిజిస్ట్రేషన్ శాఖలో ఏర్పడే ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.