తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్యశాఖ కీలక నిర్ణయం.. కొత్త వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దు! - private practice for new doctors

Private Practice Cancelled for New Doctors: రాష్ట్ర వైద్యరంగంలో ఆ శాఖ కీలక మార్పులు చేపట్టనుంది. ఇకపై కొత్తగా నియమించబోయే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దు చేయనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పనిచేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కాన్పు సిజేరియన్లపై కూడా కఠినచర్యలు తీసుకోనుంది. ఈ మేరకు సంస్కరణలపై వైద్యారోగ్యశాఖ కసరత్తు మొదలుపెట్టింది.

private practice cancelled for new doctors
కొత్త వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దు

By

Published : Apr 9, 2022, 7:00 AM IST

Private Practice Cancelled for New Doctors: రాష్ట్రంలో కొత్తగా నియమించబోయే వైద్యులకు సర్వీసు నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. నూతన వైద్యనియామకాల్లో ప్రైవేటు ప్రాక్టీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలు అందిస్తున్నారు. కొందరైతే ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సిన సమయాల్లోనూ సొంత ప్రాక్టీసు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు గంట, రెండు గంటలు మాత్రమే ప్రభుత్వాసుపత్రిలో ఉండి.. మధ్యాహ్నంలోపే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ ధోరణి ఉస్మానియా, గాంధీ తదితర బోధనాసుపత్రులు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో కొందరు రెండు, మూడు రోజులకోసారి విధులకు హాజరవుతూ.. మిగిలిన సమయాన్ని సొంత ఆసుపత్రులకే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుల విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా.. కొత్తగా నియమితులయ్యే వైద్యులకు మాత్రం నిబంధనలు విధించాలని వైద్యశాఖ నిర్ణయించింది.

నిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన ఉంది. దీన్నే ఇతర అన్ని ప్రభుత్వాసుపత్రుల వైద్యులకూ వర్తింపచేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కానీ ఈ షరతు విధిస్తే, ప్రభుత్వరంగంలో పనిచేయడానికి స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు ముందుకొస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. వీటిని ముఖ్యమంత్రి ఆమోదించాక, కొత్త నియామక నోటిఫికేషన్‌ నిబంధనల్లో మార్పులు చేస్తారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లుగా వైద్యులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపై వీరికి చికిత్సలపరమైన అంశాలను మాత్రమే అప్పగించి, వైద్యేతర అంశాల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు ఇవ్వాలని నిర్ణయించింది. వీరు జిల్లా ఆసుపత్రుల్లో పరిపాలనాధికారులుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణకు అప్పగించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

ప్రసవ కోతలను అదుపు చేయాల్సిందే:దేశంలో అత్యధికంగా కాన్పు కోతలు (సిజేరియన్లు) నిర్వహిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్లు కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. వీటిపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. ప్రతి నెలా వెల్లడయ్యే గణాంకాలను పరిశీలిస్తూ, అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవసరమైతే సంబంధిత వైద్యుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి కూడా వెనకాడబోమని వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేటు మందుల షాపులెందుకు?:ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కొత్త నిబంధనలు రూపొందించాలని, గుత్తాధిపత్యం లేకుండా పారదర్శకంగా కాంట్రాక్టులు అప్పగించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవల్లో రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు.. అక్కడ ప్రైవేటు మందుల షాపుల నిర్వహణకు ఎందుకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా సిద్ధమైంది. గ్రామాల్లో కీళ్లనొప్పులపై వైద్యశిబిరాలు నిర్వహించి, మోకీలు మార్పిడి అవసరమైన వారికి ఉచితంగా ప్రభుత్వాసుపత్రుల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని హేతుబద్ధీకరిస్తారు. ఉదాహరణకు ఒక్క గాంధీలోనే దాదాపు 60 మంది వరకు మత్తు వైద్యులుండగా.. కొన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఒకరిద్దరే ఉన్నారు. ఇటువంటివి సర్దుబాటు చేస్తారు. నిమ్స్‌లో కొత్తగా 250 పడకలతో మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని త్వరలో నెలకొల్పుతారు. పీహెచ్‌సీల్లో వైద్యులు, ఇతర సిబ్బంది సమయ పాలన పాటించేందుకు సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానాలను అమలు చేయనున్నారు.

ఇదీ చదవండి:సూత్రదారుల ఆచూకీ ఎక్కడ!.. మత్తుమాఫియా ‘కీ’లక వ్యక్తుల కోసం వేట

ABOUT THE AUTHOR

...view details