తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఏర్పాటుకానుంది. రాష్ట్రానికి జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ(ఎన్సీడీసీ)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదముద్ర వేసింది. స్థల పరిశీలన కోసం 12, 13 తేదీల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో ఆరోగ్యశాఖ తలమునకలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్సీడీసీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు, మరో 27 కొత్త శాఖలను రాష్ట్రాల్లో నెలకొల్పాలనేది లక్ష్యం.
400 కోట్లు కేటాయించిన ఆర్థిక సంఘం...
ఇందులో భాగంగా 12వ ఆర్థికసంఘం నిధుల్లో కేంద్రం రూ.400 కోట్లు కేటాయించింది. కొత్తగా నెలకొల్పే శాఖలకు సొంత భవనాలు నిర్మించాలని నిర్దేశించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడెకరాల అనువైన స్థలాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వేర్వేరు చోట్ల స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పటికే నిర్మితమైన భవనం అందుబాటులో ఉంటే త్వరగా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వీలవుతుందనే అభిప్రాయాన్ని ఇటీవల కేంద్ర ఉన్నతాధికారులు వ్యక్తపరచడంతో ఉన్నతాధికారులు వ్యూహం మార్చారు. కోఠిలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం ఆవరణలో..గతంలో ఏపీ వైద్యఆరోగ్యశాఖ కార్యకలాపాలు సాగించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అందులో మూడంతస్తుల భవనాన్ని ఎన్సీడీసీ కోసం కేటాయించాలని నిర్ణయించారు. అందులో ఒక అంతస్తును ఎన్సీడీసీ కార్యాలయ అవసరాలకు, మిగిలిన రెండు అంతస్తుల్లో ప్రయోగశాల, ఇతర సౌకర్యాలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించారు.