తెలంగాణ

telangana

ETV Bharat / city

నల్లమలలో యురేనియం అన్వేషణకు సన్నద్ధం

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై... కేంద్రం ముందుకెళ్లే ధోరణిలోనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో.. స్థానికంగా చేపట్టబోయే పనుల గురించి దిశానిర్ధేశం చేసింది. ఆ మేరకు క్షేత్ర స్థాయి అధికారులను రాష్ట్ర సర్కారు అప్రమత్తం చేసింది. పూర్తి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించింది. మరోవైపు తవ్వకాలపై రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు.. ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

By

Published : Aug 31, 2019, 6:24 AM IST

Updated : Aug 31, 2019, 7:10 AM IST

నల్లమలలో యురేనియం అన్వేషణకు సన్నద్ధం

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఇక్కడ ఖనిజాన్వేషణకు అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) సిద్ధమవుతోంది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ప్రాంతంలో సర్వే, ఖనిజాన్వేషణకు సంబంధించి తెలంగాణ అటవీశాఖకు ప్రతిపాదనలు పంపింది. యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యత తెలుసుకునేందుకు దాదాపు 21,000 ఎకరాల అటవీ ప్రాంతంలో సర్వేకు అనుమతివ్వాలని కోరింది. రెండు అటవీ ప్రాంతాల్లో 4,000 వరకు బోర్లు వేస్తామని పేర్కొంది.
అడవుల్లోకి వెళ్లేందుకు.. నమూనాల సేకరణకు బోర్ల రూపంలో జరిపే తవ్వకాల కోసం భారీ యంత్రాలు, వాహనాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది.

భూమిలో పెద్దపెద్ద బోర్లు...

ఏఎండీ భూగర్భం నుంచి యురేనియం నిక్షేపాల నమూనాల సేకరణ కోసం దాదాపు 75 సెం.మీ. చుట్టుకొలత ఉండే భారీ బోర్లు వేయనున్నట్లు సమాచారం. యురేనియం అన్వేషణపై ఏఎండీకి మే 22న సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్ర అటవీ సలహా మండలి.. తెలంగాణ అటవీశాఖకు వివరాలు సమర్పించాలని స్పష్టంచేసింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రాంతీయ డైరెక్టర్‌ జులై 1న ఆ సమాచారం అప్‌లోడ్‌ చేశారు. అందులో పూర్తి వివరాలు లేకపోవడంతో.. అప్పటి తెలంగాణ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌కుమార్‌ ఝా జులై 4న ఏఎండీ ప్రాంతీయ డైరెక్టర్‌కు లేఖ రాశారు. తవ్వకాలు జరపాలనుకుంటున్న ప్రాంతాల మ్యాప్‌లు, వివరాలు ఇవ్వాలని కోరారు.

అటవీశాఖ కోరిన వివరాలివి

  • అమ్రాబాద్‌ అభయారణ్యంలో ఏయే ప్రాంతాల్లో యురేనియం కోసం అన్వేషణ చేస్తారు? ఎన్నిచోట్ల బోర్లు వేస్తారు?
  • ఎన్ని వాహనాలు, యంత్రాల్ని అడవిలోకి తీసుకెళ్తారు? సర్వేకు ఎంతమంది సిబ్బందిని తీసుకెళ్తారు?
  • అడవిలో ఎన్నిరోజులు ఉంటారు? అక్కడికి వెళ్లడానికి రహదారులు చూసుకున్నారా?
  • ప్రశాంత్‌కుమార్‌ ఝా లేఖకు స్పందిస్తూ ఏఎండీ రెండురోజుల క్రితం పూర్తివివరాలతో తాజా ప్రతిపాదనల్ని అటవీశాఖకు పంపింది.


పార్టీల వ్యతిరేకత

ప్రకృతి సంపదకు, జీవవైవిధ్యానికి నిలయం నల్లమల అడవులు. దట్టమైన అటవీప్రాంతంతో పాటు వివిధ రకాల అరుదైన వన్యప్రాణులకు, చెంచుజాతి ప్రజలకు ఆవాసమిది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఇక్కడే ఉంది. తెలంగాణలో ఉన్న పెద్దపులుల్లో మూడింట రెండొంతులు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు జరిపేది అన్వేషణ మాత్రమే అని చెబుతున్నా నమూనాల సేకరణకే వేల సంఖ్యలో బోర్లు వేయబోతున్నారు. పూర్తిస్థాయి తవ్వకాలు ఎంత భారీగా ఉంటాయో అనేదానిపై ఆందోళన పెరుగుతోంది. పులులు సహా వన్యప్రాణులపైనా, చెంచులపైనా, కృష్ణా జలాలపైనా యురేనియం దుష్ప్రభావం పడుతుందన్న ఆందోళన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తల నుంచి వ్యక్తం అవుతోంది. ఇంత వ్యతిరేకత వస్తున్నా ఏఎండీ ముందుకే వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.

83 చ.కిమీ. విస్తీర్ణంలో..

  • యురేనియం కోసం సర్వే చేసే ప్రాంతాలు, విస్తీర్ణాన్ని ఏఎండీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది.
  • నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం పరిధిలో మొత్తం 83 చ.కి.మీ. మేర సర్వే, అన్వేషణకు అనుమతివ్వాలని అటవీశాఖను కోరింది.
  • నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో 7 చ.కి.మీ. ప్రాంతం (2 అటవీ బ్లాకులు), నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో 76 చ.కి.మీ. ప్రాంతం (2 అటవీ బ్లాకులు)లో బోర్ల ద్వారా అన్వేషించనుంది.
  • అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని ఓ బ్లాక్‌లో 3,000 బోర్లు, మరో బ్లాక్‌లో 1,000 బోర్లు తవ్వనుంది.
  • ఒక్కో బోరు తవ్వకానికి 4 - 5 రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: "అమ్రాబాద్​లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలి"

Last Updated : Aug 31, 2019, 7:10 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details