గోదావరి నదిపై చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం తలపెట్టిన ‘జల దీక్ష’ను పోలీసులు భగ్నం చేశారు. ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుని.. గృహనిర్బంధం చేశారు. తమ కళ్లుగప్పి బయటికి వచ్చినవారిని అరెస్టు చేశారు. కొన్నిచోట్ల పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్అలీ తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్కను ఖమ్మం జిల్లా వైరాలో గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే సీతక్కను ములుగులో, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును మంథనిలో పోలీసులు అడ్డుకున్నారు. శ్రీధర్బాబు సాయంత్రం వరకు ఇంట్లోనే నిరసన దీక్షకు కూర్చున్నారు.
ధర్నాలు.. వాగ్వాదాలు
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ను సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు గోడ దూకి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పొన్నం ప్రభాకర్ సైతం ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ తదితరులను రాజన్న పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉంచారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరగా.. అర్ధరాత్రి కొత్తగూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చేసిన వీహెచ్.. రోడ్డుపై పడుకొని ధర్నాకు దిగారు. వారిని అరెస్టు చేసి లక్ష్మీదేవిపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ఆందోళనకు దిగారు. జగిత్యాల నుంచి తుమ్మిడిహెట్టికి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కారును అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై నిరసనకు దిగారు. ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
గౌరవెల్లి- గండిపల్లి వద్దకు సంపత్కుమార్
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ పోలీసుల కళ్లుగప్పి శనివారం ఉదయం కార్యకర్తలతో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి- గండిపల్లి ప్రాజెక్టుపైకి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. సంపత్కుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.