తెలంగాణ

telangana

విజయవాడలో 12 శాతం కేసులు తగ్గాయి: సీపీ శ్రీనివాసులు

By

Published : Dec 27, 2020, 6:23 PM IST

ఈ ఏడాది ఏపీ విజయవాడ నగరంలో నమోదైన కేసుల వివరాలను పోలీసు కమిషనర్ శ్రీనివాసులు వెల్లడించారు. 2019తో పోల్చితే నగరంలో కేసుల సంఖ్య 12 శాతం తగ్గిందన్నారు. గతేడాదితో పోల్చితే మహిళలపై నేరాల సంఖ్య 11.19 శాతం తగ్గిందని వెల్లడించారు.

విజయవాడలో 12 శాతం కేసులు తగ్గాయి: సీపీ శ్రీనివాసులు
విజయవాడలో 12 శాతం కేసులు తగ్గాయి: సీపీ శ్రీనివాసులు

2019తో పోల్చితే 2020లో 12 శాతం కేసుల సంఖ్య తగ్గిందని ఏపీ విజయవాడ నగర పోలీస్​ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పష్టం చేశారు. కొవిడ్ లాక్​డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై మొత్తం 3,568 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. 78.77 శాతం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. గతంతో పోలిస్తే...సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. మహిళలపై నేరాల సంఖ్య గతేడాదితో పోల్చితే 11.19 శాతం తగ్గాయన్నారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుల విచారణ, కోర్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేస్తున్నామన్నారు. 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్ష పడిందన్నారు. 2020లో మొత్తం 15,382 కేసులు నమోదయ్యాయని సీపీ వివరించారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గాయ్..

రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని... అందుకు లాక్​డౌన్ కూడా కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. మోటారు వాహన చట్టం ప్రకారం మొత్తం 6,94,891 కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 75 గంజాయి కేసులు నమోదు చేసి 166 మందిని అరెస్టు చేశామని.. అందులో రూ. కోటి 60లక్షల 95వేల 200 విలువైన 4,135.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి, డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందించేలా చర్యల చేపట్టామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్​కు ప్రాధాన్యత..

1,231 లిక్కర్ కేసులు నమోదు చేసి 1,02,957 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిరంతర నిఘాతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డయల్ 100కి ఫోన్ వచ్చిన తర్వాత గరిష్ఠంగా 6 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 79 రౌడీషీట్లు తెరిచామని... పటమట గ్యాంగ్​వార్ కేసుల్లో 61 మందిని అరెస్టు చేసి, 25 మందిపై రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనిస్తున్నామని... మహిళా మిత్రల సహకారంతో సత్ఫాలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మిత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాల్సివుందని అభిప్రాయపడ్డారు.

ఆన్​లైన్ మోసాల్లో చిక్కుకోవద్దు..

మైక్రో ఫైనాన్స్, ఆన్​లైన్ ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకుని, విష వలయంలో చిక్కుకుని నష్టపోవద్దని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి మొత్తం 70-80 యాప్స్​ను గుర్తించినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్​ను మూడు దశల్లో నిర్వహించి 424 మంది చిన్నారులను గుర్తించినట్లు స్పష్టం చేశారు. డిసెంబరు నెలలో యాంటీ డ్రగ్ డ్రైవ్​లో భాగంగా 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కొవిడ్-19 పరిస్థితుల్లో పోలీసులు సమర్ధవంతంగా పని చేశారని కితాబిచ్చారు. వలస కార్మికులకు, కొవిడ్ బాధిత కుటుంబాల వారికి పోలీసు శాఖ ద్వారా సహాయం అందించామని, 385 మంది పోలీసులు కొవిడ్ బారినపడగా..ఇద్దరు పోలీసులు మృతి చెందినట్లు తెలిపారు.

ఈ ఏడాది కొన్ని ప్రతిష్టాత్మక అవార్డులు విజయవాడ పోలీసు శాఖకు లభించాయని సీపీ గుర్తు చేశారు. సీసీ టీవీ నెట్​వర్క్​ను అభివృద్ధి చేసి, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేస్తామని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన 2020

ABOUT THE AUTHOR

...view details