సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్కు ఘటన మరకవముందే తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాల్పుల ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు ఘటనల్లో తుపాకులు మాయమై నెలలు గడిచినా... పోలీసులు వాటిని కనిపెట్టలేకపోయారు. చివరకు నిందితులు దొరికితే తప్ప వాటి ఆచూకీ దొరలేదు. దీన్ని బట్టి పోలీసుల విచారణ ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు.
కేబీఆర్ పార్కు వద్ద 2014 నవంబరులో అరబిందో ఫార్మా అధినేత నిత్యానందరెడ్డిని అపహరించేందుకు వచ్చిన ఆగంతకుడు... ఏకే47తో కాల్పులు జరిపాడు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఆ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చిందనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. అది గ్రేహౌండ్స్ విభాగం నుంచి 18 నెలల క్రితమే మాయమైనట్లు విచారణలో తేలింది. దీనిపై నార్సింగి పోలీస్స్టేషన్లో గ్రేహౌండ్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రేహౌండ్స్ సిబ్బందిని విచారించగా... కూబింగ్కు వెళ్లిన సమయంలో అడవుల్లో పడిపోయి ఉంటుందని సమాధానమిచ్చారు. కాల్పులు జరిపిన అగంతకుడు... గ్రేహౌండ్స్లో కానిస్టేబుల్గా పనిచేసినప్పుడు అపహరించినట్లు కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనతో బయటపడింది.