తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2020, 5:27 AM IST

ETV Bharat / city

రక్త నిల్వలు తగ్గిన వేళ.. పోలీసుల స్ఫూర్తి

భారత్ - చైనా సరిహద్దులోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్​ 21 జరిగిన ఘటనలో విరోచితంగా పోరాడి అమరులైన వీరులను స్మరించుకుంటూ పోలీస్​ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేస్తోంది.

Police Martyrs' Day
రక్త నిల్వలు తగ్గిన వేళ.. పోలీసుల స్ఫూర్తి

పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలీస్‌శాఖ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. రక్తదానం చేయడమే కాకుండా... పలువురిని ప్రోత్సహిస్తున్నారు పోలీసులు. వారం రోజులపాటు రక్తదాన శిబిరాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిన వేళ పోలీసుల స్ఫూర్తిని పలువురు కొనియాడుతున్నారు.

చేస్తూ.. చేయిస్తూ..

శరీర నిర్మాణంలో రక్తం అత్యంత ప్రాముఖ్యమైనది. అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే రక్తప్రసరణ సాఫీగా జరగాలి. శరీరంలో నిర్ధారించిన స్థాయిలో రక్తం లేకపోతే ప్రాణాపాయస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. రోగాల బారిన పడిన వారికి, శస్త్ర చికిత్సలు చేసుకునే వారికి రక్తం అవసరపడుతుంది. తలసేమియా రోగులకైతే తరచూ రక్తం ఎక్కించాలి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోయాయి. రక్తం అవసరమైన సందర్భాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. నేరుగా రక్తదానం చేయడమే కాకుండా... సంబంధిత స్టేషన్ల పరిధిలోని ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

నాటి అమరుల వీరోచిత పోరాటానికి గుర్తుగా..

విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత్ - చైనా సరిహద్దులోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న 10 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు విధుల్లో ఉండగా... చైనా సైనికులు సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చారు. వారితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలారు. సైనికుల వీర మరణాలను స్మరించుకుంటూ 1960 అక్టోబర్ 21న 'పోలీసు అమరవీరుల దినోత్సవం' నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 326 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులుబాశారు. ఈ ఏడాది వారం రోజుల పాటు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించాలని కేంద్రం చెప్పింది. ఆ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేయడం ఎంతో సంతృప్తి కలిగిస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

రక్త నిల్వలు తగ్గుతున్న వేళ.. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శిబిరాల వల్ల రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఇవీచూడండి:కొవిడ్​ ఆస్పత్రులపై తనిఖీ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details