తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2022, 5:54 AM IST

Updated : Mar 31, 2022, 7:06 AM IST

ETV Bharat / city

వరుస వడ్డింపులు.. సామాన్యులకు ముచ్చెమటలు

ధరాభారంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వరుస వడ్డింపులతో అతలాకుతలమవుతున్నాడు. మార్చి 22 నుంచి రోజూ(24వ తేదీ మినహా) పెట్రో మోత మోగుతూనే ఉంది. ఈ తొమ్మిది రోజుల్లో మొత్తంగా పెట్రోలుపై రూ.6.32 పెరగడంతో లీటరు ధర రూ.114.52కు చేరుకుంది. డీజిల్‌పై రూ.6.09 పెంపుతో లీటరు రూ.100.71కు చేరింది. అసలే చమురు ధరలతో అల్లాడుతున్న జనానికి టోల్‌ బాదుడూ మొదలవుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్‌ఛార్జీలు అమలు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ సన్నద్ధమైంది. మరోవైపు కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఏ రకం చూసుకున్నా.. కిలో రూ.40 పైమాటే. పచ్చి మిర్చి ధర పైపైకి వెళ్తోండగా.. మునగ, నిమ్మకాయల కొరత వేధిస్తోంది. మొత్తంమీద ఏ వస్తువు ధర చూసినా.. వినియోగదారులకు ముచ్చెమటలు తప్పడంలేదు.

petrol and diesel prices hike
petrol and diesel prices hike

చమురు ధరలు రోజురోజుకూ దడ పుట్టిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో మళ్లీ ప్రారంభమైన వడ్డింపునకు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మంటలూ తోడయ్యాయి. తొలుత బల్క్‌ ధరలను పెంచిన చమురు సంస్థలు.. ఆ తర్వాత సాధారణ వినియోగదారులపైనా వరుసగా రోజుకింత భారం మోపుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 0.91 పైసలు, డీజిల్‌పై 0.87 పైసలను వడ్డించాయి. గత ఏడాది నవంబరు తర్వాత లీటరు డీజిల్‌ ధర రూ.వందను అధిగమించటం ఇదే. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం, హైదరాబాద్‌ నగరంలో బుధవారం డీజిల్‌ రూ.వందను దాటింది. గడిచిన తొమ్మిది రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

రికార్డు ధరలకు పరుగులు:పెట్రోలు, డీజిల్‌ ధరలు మునుపటి రికార్డులను అధిగమించేందుకు పరుగులు తీసుకున్నాయి. గడిచిన రెండున్నర దశాబ్దాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు వంద రూపాయల మార్కును అధిగమించటం ఇదే రెండో దఫా. గత ఏడాది నవంబరు రెండో తేదీన డీజిల్‌ లీటరు ధర రూ.107.37 పలికింది. 1995 తరవాత అదే అత్యధిక ధర. తాజాగా మళ్లీ రూ. 100.71కి చేరుకుంది. పెట్రోలు గత ఏడాది నవంబరులో అత్యధికంగా రూ.118.04 వరకు వెళ్లింది. తాజాగా పెట్రోలు ధర రూ.114.52కు చేరుకుంది. త్వరలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుదలలో కొత్త రికార్డులు నమోదవుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఉపశమనం ఉండేనా..:రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రాజీకి అడుగులు పడుతున్న తరుణంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరల్లో ఏమైనా ఉపశమనం లభిస్తుందా.. అన్నది చర్చనీయాంశంగామారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర బుధవారం స్వల్పంగా పెరిగి 112 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఉద్రిక్తతలు తగ్గితే ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలుంటాయని వ్యాపారవర్గాల అభిప్రాయం. అయితే, ఆ తగ్గింపు వినియోగదారులకు అందించేందుకు చమురు సంస్థలు ఏ మేర ముందుకు వస్తాయన్నది ప్రశ్నార్థకమేనని డీలర్లు చెబుతున్నారు.

టోల్‌ఛార్జీల మోతా మొదలవుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. వాహనం స్థాయిని బట్టి కనిష్ఠంగా రూ.పది, గరిష్ఠంగా రూ.90 పెరిగింది. టోల్‌ప్లాజా పరిధిలోని స్థానికులకు ఇచ్చే నెలవారీ సీజన్‌ టికెట్‌ ధర రూ.30 వరకు పెరిగింది. ఇతర వాహనాలకు ఇచ్చే నెలవారీ సీజన్‌ టికెట్‌ ధరను కూడా జాతీయ రహదారుల సంస్థ పెంచింది. ఏటా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి టోల్‌ఛార్జీలను ఆ సంస్థ పెంచుతుంది. ప్లాజాల మధ్య దూరం, వాహనాల రాకపోకల సంఖ్య, టోల్‌ వసూలు కాంట్రాక్టు వ్యవధి ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుదలను లెక్కిస్తారు. రాష్ట్రం మీదుగా వెళ్లే ఏడు జాతీయ రహదారుపై 29 టోల్‌ప్లాజాలు ఉన్నాయి.

కాయగూరలతో కూడిన భోజనం ఆరోగ్యకరం. కానీ, రోజూ కాయగూరలు వండుకోవాలంటే సామాన్యుల జేబుకు చిల్లు తప్పడం లేదు. మార్కెట్లో ఏది కొందామన్నా కిలో రూ.40కి తక్కువగా లేదు. పచ్చిమిరప అయితే ఏకంగా రూ.100 దాకా పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. వేసవి ఎండలతో దిగుబడి తగ్గడంతో పాటు పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయల రవాణా ఖర్చులు తడిసిమోపెడు కావడం ఇందుకు కారణం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చిల్లర మార్కెట్లలో పచ్చి మిరపకాయలు కిలో రూ.80 నుంచి 100 వరకూ పలుకుతున్నాయి. బుధవారం రైతుల నుంచి టోకు వ్యాపారులే కిలో రూ.60కి కొన్నారు. పచ్చి మిరపకాయలు 90 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే వస్తుండటంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దొండ, చిక్కుడు, బీన్స్‌, క్యాప్సికం, కాకరకాయ, గోరుచిక్కుడు వంటివన్నీ చిల్లర మార్కెట్లలో కిలో రూ.40కి పైగా అమ్ముతున్నారు. తమిళనాడు నుంచి వచ్చే మునగకాయల ధర క్రమంగా పెరుగుతోంది. నిమ్మకాయలకు కొరత అధికంగా ఉంది.

* ఉదాహరణకు గత ఏడాది నవంబరులో హైదరాబాద్‌లోని ప్రధాన టోకు మార్కెట్‌ బోయిన్‌పల్లికి 49,852 క్వింటాళ్ల పచ్చి మిరపకాయలు రాగా టోకు ధర కిలోకు రూ.37 పలికింది. ఈ నెల(మార్చి)లో కేవలం 26,602 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠ టోకు ధర రూ.75కి చేరింది. నాలుగు నెలల వ్యవధిలో 100% పెరగడం గమనార్హం. 2021 మార్చిలో కిలో టోకు ధర కేవలం రూ.25 ఉండగా.. ఇప్పుడు 200% పెరగడంతో చివరికి ఆ భారం సామాన్యులపై పడుతోంది.

‘దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని ములుగు, 400 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం జిల్లా, 500 కిలోమీటర్లకు పైగా దూరంలోని కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాల నుంచి ప్రస్తుతం హైదరాబాద్‌కు నిత్యం కూరగాయలు వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తరచూ పెరుగుతుండటంతో రవాణా వ్యయం ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ’ మార్కెటింగ్‌ శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు తెలిపారు.

ఇదీచూడండి:Traffic Pending Challans: ట్రాఫిక్ పెండింగ్​​ చలానాల చెల్లింపునకు గడువు పెంపు

Last Updated : Mar 31, 2022, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details