హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 2750 బస్సులున్నాయి. కార్యాలయ వేళల్లో ఒక్కో బస్సులో 100 మంది ఎక్కితే ఒకేసారి 2.75 లక్షల మంది ప్రయాణించొచ్చు. ఒక్కో బస్సు ఉదయం 4 ట్రిప్పులు, మధ్యాహ్నం 4 ట్రిప్పులు తిరిగినా రోజుకు 22 వేల ట్రిప్పులవుతాయి. ఒక్కో ట్రిప్పులో 100 మంది చొప్పున లెక్కేస్తే రోజుకు 22 లక్షల మంది అవుతారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం 29 లక్షల మంది ప్రయాణిస్తున్నారని లెక్కలు చెబుతున్నారు. మరి ఏ లెక్కన చెప్తున్నారో వారికే తెలియాలి. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకే బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే 10.45 వరకూ బస్సులున్నాయి.
- ఇక ఐటీ సంస్థల్లో ప్రత్యక్షంగా 5 లక్షల మంది, పరోక్షంగా మరో 2 లక్షల మంది పనిచేస్తున్నారు. 60 శాతానికి మించి ప్రజారవాణానే వినియోగించే వీరు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. మెట్రోలో, ఎంఎంటీఎస్లో ప్రయాణించినా.. కార్యాలయానికి చేరువ వరకూ వెళ్లాలంటే బస్సుల్లో ప్రయాణించాల్సిందే. కార్యాలయాలు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
వేలాడుతూ రాకపోకలు..
బస్సులో సీట్లు 45 ఉంటే మరో 15-20 మంది నిల్చుని ప్రయాణించవచ్చు. కానీ ప్రస్తుతం బస్సుల్లో 100 మందికిపైగా ప్రయాణిస్తున్నారు. శివార్లకు వెళ్లే కొన్ని బస్సుల్లో విద్యార్థులు వేలాడుతూ వెళ్తున్నారు. హయత్నగర్, మేడ్చల్, పటాన్చెరు, చేవెళ్ల, ఘట్కేసర్ వైపు వెళ్లే బస్సులను చూస్తే విద్యార్థుల అవస్థలు కనిపిస్తాయి. పాస్లున్నవారే దాదాపు 6 లక్షల మంది.
ముంబయి జనాభా 2011 లెక్కల ప్రకారం 1.24 కోట్ల మంది ఉన్నారు. 2021 నాటి అంచనాల మేరకు 2.06 కోట్లకు చేరింది. ఆ నగరాన్ని తలచుకోగానే సబర్బన్ రైళ్ల పరుగులే గుర్తుకొస్తాయి. ఉదయం 4 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు లోకల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో నిత్యం 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు 4,680 ఉంటే ప్రయాణించేవారు 4.50 లక్షల మందే.
బెంగళూరులో..
బెంగళూరు జనాభా 2011 లెక్కల ప్రకారం 84 లక్షల మంది ఉంటే 2021 నాటి అంచనాల మేరకు 1.27 కోట్లకు చేరింది. అక్కడి ప్రజారవాణా మెరుగ్గా ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తం 6,529 బస్సులున్నాయి. వీటిలో ప్రయాణించేవారి సంఖ్య 35.8 లక్షల మంది. 2025 నాటికి ఈ బస్సుల సంఖ్యను 12,500 చేయాలని బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) నిర్ణయించింది. దీనికితోడు బెంగళూరులో సబర్బన్ రైలు సర్వీసులు, మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. నేరుగా విమానాశ్రయానికి సబర్బన్ రైళ్లున్నాయి.