Oppositions Comments: దేశంలో మార్పు కోసం కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. రాజ్యంగబద్ధమైన పదవీలో ఉండి ఆ రాజ్యాంగాన్నే ముఖ్యమంత్రి అవమానపరిచారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా కేసీఆర్ ప్రవర్తించారని ఆరోపించారు. సీఎంలో అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోందన్న కిషన్ రెడ్డి... తీరుమార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అర్ధరహితమని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇందుకు నిరసనగా గురువారం అన్ని పార్టీ కార్యాలయాల్లో నిరసన చేపడతామని వెల్లడించారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే... కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రగిలించి లబ్ది పొందాలని చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసం భాజపా చేస్తున్న కుట్రలను కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడకుండా... అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ను ముఖ్యమంత్రి అవమానించారని ఆక్షేపించారు.