తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2020, 3:46 AM IST

ETV Bharat / city

ఆన్​లైన్ బడి.. మారిన నిబంధనలు!

నర్సరీ నుంచి యూకేజీ వరకు రోజుకు 45 నిమిషాల పాటు..... వారంలో మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌ పాఠాలు బోధించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులు ఉండాలని నిర్దేశించింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది.

online classes guidelines in Telangana state
ఆన్​లైన్ బడి.. మారిన నిబంధనలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులపై విద్యాశాఖ విధివిధానాలు ప్రకటించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన ప్రజ్ఞత మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించాలని స్పష్టం చేసింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు రోజుకు గరిష్టంగా 45 నిమిషాల పాటు.. వారంలో మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌ పాఠాలను బోధించాలని పేర్కొంది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌ పాఠాలు ఉండాలని స్పష్టం చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 45 నిమిషాలకు మించకుండా... రోజుకు రెండు తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలిపింది. ఆరు నుంచి 8వ తరగతి వరకు... రోజుకు మూడు తరగతులు.. 9 నుంచి 12 వరకు రోజుకు నాలుగు తరగతులు మాత్రమే బోధించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు.

ఎస్‌సీఈఆర్‌టీ వర్క్‌షీట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన విద్యాశాఖ.. ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయలు అందరూ హాజరు కావాలని విద్యా శాఖ పేర్కొంది. టీవీలు లేని విద్యార్థుల కోసం పంచాయతీ లేదా ఇతర విద్యార్థుల సహకారం తీసుకోవాలని తెలిపింది. పాఠ్యపుస్తకాలతోపాటు ఎస్​సీఈఆర్​టీ ప్రత్యేకంగా రూపొందించిన వర్క్ షీట్లు విద్యార్థులకు చేరేలా ఉపాధ్యాయలు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

వాట్సప్ ద్వారా సందేహాలు నివృత్తి

టీశాట్, దూరదర్శన్ ప్రసారాలు జరిగేలా డీఈఓలు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని.. కేబుల్ ఆపరేటర్లతో చర్చించాలని సూచించింది. విద్యుత్ సరఫరా ఉండేలా సంబంధిత అధికారులను కోరాలన్నారు. టీశాట్, దూరదర్శన్ ప్రసారాల షెడ్యూలును వీలైనంత ముందుగా తల్లిదండ్రులకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులకు టీవీ పాఠాల్లో అనుమానాలు వస్తే ఫోన్ లేదా వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ పాఠాలకు తల్లిదండ్రుల సహకరించాలని.. అదే సమయంలో సైబర్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బడులకు దూరంగా ఉన్న విద్యార్థులు, బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్చించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి-బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ABOUT THE AUTHOR

...view details