తెలంగాణ

telangana

ETV Bharat / city

లాటరీ ద్వారా ఎంపికైన యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు

అది ముక్కోణపు ప్రేమ కథ(Triangle Love Story).. ఎలా పరిష్కరించాలో తలలు పట్టుకున్న గ్రామస్థులు చివరకు లాటరీ(Bridegroom Lottery) ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి వివాహం జరిపించగా కథ సుఖాంతమైంది. ఇదేదో సినిమాలోని సన్నివేశమనుకుంటే తప్పులో కాలేసినట్లే. కర్ణాటకలో జరిగిందీ సంఘటన.

By

Published : Sep 6, 2021, 3:52 PM IST

Bridegroom Lottery
Bridegroom Lottery

ముక్కోణపు ప్రేమకథను(Triangle Love Story) విభిన్నంగా పరిష్కరించారు ఓ గ్రామస్థులు. లాటరీ(Bridegroom Lottery) ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి, యువకుడితో వివాహం జరిపించారు. దాంతో.. కొన్ని నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథ శుక్రవారం సుఖాంతమైంది. హాసన జిల్లా సకలేశపురం ప్రాంతంలోని ఓ కుగ్రామంలో జరిగిన సంఘటనను ఆ ఊరి ప్రజలు ఆదివారం బయటపెట్టారు.

అసలేం జరిగింది?

సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు అంతర్జాలం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరిని ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ఇద్దరు యువతులకూ అతడంటే చచ్చేంత ప్రేమ. అతడు లేకుండా బతకలేమన్నారు. అతడ్ని వివాహం చేసుకునేందుకు ఇద్దరూ సమ్మతించారు. అయితే ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు. గ్రామస్థులు 'పంచాయితీ' చేసినా ఫలితం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో ఓ యువతి ముందుకొచ్చి ఆ యువకుడు లేని జీవితం తనకు వ్యర్థమని చెప్పి విషం తాగింది.

ఆ షరతుతో...

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆమె కోలుకుని గ్రామానికి తిరిగి వచ్చింది. శుక్రవారం మరోసారి ముక్కోణపు ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చింది. గ్రామస్థులు చివరికి ఓ మార్గాన్ని కనిపెట్టారు. లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని, ఇందులో విఫలమైన యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా వెనుదిరగాలని షరతు విధించారు. లాటరీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ యువకుడితో ఆమె వివాహం జరిపించారు. ప్రేమపురాణంలో విఫలమైన యువతి తన పోటీదారుతో మాట్లాడుతూ 'మీ వివాహ జీవితం సంతోషంగా కొనసాగాల'ని ఆకాంక్షించింది. అయితే తనను మోసగించిన యువకుడిని సులువుగా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించడం గమనార్హం.

ఇదీ చూడండి:తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి... 45 తులాల బంగారం అపహరణ

ABOUT THE AUTHOR

...view details