కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతులు తప్పనిసరి హైదరాబాద్ మహానగరం నూతన సంవత్సర సంబురాలకు ముస్తాబవుతోంది. వేడుకల సందర్భంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాలకు దూరంగా యువత వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హోటళ్లు, పబ్, బార్ల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అనుమతి తప్పనిసరి..
హోటళ్లు, వేడుకల నిర్వాహకులతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సమావేశమై పాటించాల్సిన నిబంధనల గురించి చర్చించారు. ప్రతి ఒక్కరూ వేడుకలకు కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, హాజరయ్యే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు.
అంతా ఆన్లైన్లోనే...
డ్రగ్స్ విక్రయిస్తున్న వినియోగదారులు కొత్త కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. స్పాట్ ఆన్, స్పాట్ ఆఫ్, గ్రీన్ ఆర్ బ్రౌన్ ఇలా మిగిలిన వాళ్లకు అర్థం కాకుండా వాట్సప్ గ్రూపులు పెట్టుకుని మరీ డెలివరీ చేస్తున్నారు. డెలివరీ డేట్.. ప్లేస్ కూడా అంతా కోడ్ ద్వారా నడుస్తుంది. నూతన సంవత్సర వేడుకలకు ప్రతి ఏడాదీ ఈవెంట్ ఆర్గనైజింగ్ స్పాట్లు పెరుగుతున్నాయి.
ఒక్క చాక్లెట్ రూ. 500
బడా హోటళ్లు, ఈవెంట్ స్పాట్లు లక్ష్యంగా కేటుగాళ్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో డగ్స్ అందుబాటులో ఉంటే.. బాలానగర్, బోయిన్ పల్లి, ఉప్పల్, ఘటకేసర్, ధూల్ పేట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లు గుప్పుమంటున్నాయి. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్న కేటుగాళ్లు.. ఒక్కొ చాక్లెట్ రూ.500లకు విక్రయిస్తున్నారు.
"కొత్త సంవత్సర వేడుకలకు నగరం ముస్తాబవుతున్న వేళ ఈవెంట్ల రిజిస్ట్రేషన్, అనుమతులు.. అన్ని పారదర్శకంగా ఉండేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు"
ఇవీ చూడండి: తెలంగాణలో "కల్వకుంట్ల పోలీసు సర్వీస్" నడుస్తోంది: కాంగ్రెస్