తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ నెల 7న 'నేతన్న బీమా'కు శ్రీకారం.. అధికారులకు కేటీఆర్​ దిశానిర్దేశం - ktr on chenetha bheema

Chenetha Bhima scheme in Telangana : చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నెల 7 నుంచి రైతు బీమా తరహాలో 'నేతన్న బీమా' పథకాన్ని అమలు చేస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి... జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి బీమా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

chenetha Bhima scheme in Telangana
chenetha Bhima scheme in Telangana

By

Published : Aug 1, 2022, 1:43 PM IST

Updated : Aug 1, 2022, 3:34 PM IST

Chenetha Bhima scheme in Telangana : ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం రోజు ప్రారంభం కానున్న నేతన్న బీమా ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ విజయవంతం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీమా కాలంలో లబ్ధిదారులైన... చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా... 'నామినీ'కి రూ.5 లక్షలు అందుతుందని కేటీఆర్ తెలిపారు. లబ్ధిదారులు చనిపోయిన 10 రోజుల్లో ఈ మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత, పవర్ లూమ్​ కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి చెప్పారు. నేతన్నకు బీమా పథకం అమలుకు... చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని... ఈ మేరకు భారత జీవితబీమా సంస్థ - ఎల్​ఐసీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు.

వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని... రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. ప్రీమియం కోసం 50కోట్లు కేటాయించి... ఇప్పటికే 25 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 60ఏళ్ల లోపు వయసున్న చేనేత, మరమగ్గాల కార్మికులందరూ నేతన్న బీమాపథకానికి అర్హులని చెప్పారు. సుమారు 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్నబీమా వర్తిస్తుందని... పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన చేనేత, పవర్ లూం కార్మికులు, అనుబంధ కార్మికులందకీ నేతన్నబీమా పథకాన్ని అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

'చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే.. బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తోంది. ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. వారి కుటుంబాలకు భరోసాకు నిలుస్తుంది.' అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Last Updated : Aug 1, 2022, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details