హైదరాబాద్ మణికొండ నాలాలో పడి గల్లంతైన రజినీకాంత్ కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గంటలు గడుస్తున్నా.. ఇంకా అతని ఆచూకీ మాత్రం దొరకలేదు. గల్లంతైన ప్రదేశంతో పాటు నాలాను జల్లెడ పడుతున్న డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాలా కలిసే నెక్నాంపూర్ చెరువులోనూ తీవ్రంగా గాలిస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనుగొనడం క్లిష్టతరంగా మారింది.
వారి నిర్లక్ష్యమే కారణం!
గుత్తేదారు నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం అలసత్వం వెరసి ఓ వ్యక్తి గల్లంతవ్వడానికి కారణమైంది. హైదరాబాద్ మణికొండ సెక్రటేరియట్ కాలనీలో నివసించే రజనీకాంత్.. షాద్నగర్లోని నోవాగ్రీన్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని శనివారం రాత్రి సమీపంలోని దుకాణానికి వెళ్తుండగా డ్రైనేజీ పైపులైను పనుల కోసం తవ్విన గుంతలో ఊహించని విధంగా పడిపోయాడు. ఆ సమయంలో భారీ వర్షం కారణంగా వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. గుంత ఉందని తెలియక రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నీటిలో పడి గల్లంతయ్యాడు. ఘటన జరిగాక.... డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగి గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. డ్రైనేజీ గుంతల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే...చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.