రాష్ట్రవ్యాప్తంగా గతంలో వేలిముద్ర విధానంలో... రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. కరోనా కారణంగా ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓటీపీ వచ్చేందుకు ఆధార్కు ఫోన్ నంబర్ అనుసంధానించుకోవాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీ... సామాన్యులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఐరిస్ విధానానికి వివిధ కేంద్రాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఓటీపీ ఆధారంగా ఇవ్వాలంటే గ్రామాల్లో సుమారు 30 శాతం మందికి... ఆధార్తో ఫోన్ నెంబర్ అనుసంధానం లేదు. ఓటీపీ రావాలంటే ఫోన్ నెంబర్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి. లేదంటే రేషన్ దక్కదనే ఆందోళనతో బ్యాంకులు, ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. చలికి వణుకుతూ తెల్లవారుజాము నుంచే జనం బారులు తీరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆధార్ కేంద్రం తెరవలేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆధార్తో ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు లబ్దిదారులు పెద్దఎత్తున ఆధార్ కేంద్రానికి వచ్చారు. నియోజకవర్గంలో ఒకే ఒక్క ఆధార్ కేంద్రం అందుబాటులో ఉండగా.. అది కూడా సకాలంలో తెరవడం లేదని లబ్ధిదారులు నిరసన చేపట్టారు.