Jeevan Reddy Comments: రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లడానికి తెరాస, భాజపా.. రెండు పార్టీలూ పాత్రదారులేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్తో పాటు సీఎం కేసీఆర్ రాజ్యాంగం తిరగరాయాలన్న అంశంపై జీవన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇంతకాలం భాజపాతో అంటకాగిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రానికి ఏమి సాధించారని జీవన్రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ స్వలాభం కోసమే భాజపాతో కలిసి నడిచారని ఆక్షేపించారు. రాష్ట్రానికి తిరోగమనంలోకి తీసుకెళ్లేందుకు తెరాస, భాజపా పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు.
అవినీతి బయటపడుతుందనే..
కేంద్ర బడ్జెట్లో రైతులకు మద్దతు ధరపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఆహార సబ్సిడీలో లక్ష కోట్లు కోత విధించారని, మోదీ ఉపాధి హామీ పథకం నిధుల్లోనూ కోత పెట్టారని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను సీఎం కేసీఆర్ సాధించలేక పోయారని.. ఇది ఆయన అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తనకు వచ్చే కమిషన్ల కోసం తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కేవలం తన అవినీతి బయట పడుతుందనే.. జాతీయ హోదాపై కేంద్రాన్ని కేసీఆర్ గట్టిగా అడగడం లేదన్నారు.