తెలంగాణ

telangana

By

Published : Jun 21, 2022, 3:16 PM IST

ETV Bharat / city

MLA Selected for Teacher: 23 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేకు టీచర్​ జాబ్​

MLA Selected for Teacher: టీచర్ పోస్టుకు ఎంపికైన ఎమ్మెల్యే. అందేంటి.. ఎమ్మెల్యే టీచర్ పోస్టుకు ఎంపికవ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా ! అవునండీ.. మీరు విన్నది నిజమే. ఏపీలో వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో అప్పట్లో డీఎస్సీ రాసిన ధర్మశ్రీ ఇప్పుడు టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు.

MLA Selected for Teacher
వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

MLA Selected for Teacher: గతంలో 1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 23 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. డీఎస్సీ వివాదం న్యాయస్థానంలో పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై ఏపీ సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో ధర్మశ్రీ పేరు కూడా ఉంది. బీఏ సోషల్, ఇంగ్లీష్ పోస్టుకు గానూ ధర్మశ్రీ 1998లో ఉపాధ్యాయ పరీక్ష రాశారు. అనుకోని కారణాలు, కోర్టు వివాదల వల్ల 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అనంతరం ధర్మశ్రీ రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో చురుగ్గా పనిచేశారు. మాడుగుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున మెుదటి సారి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

23 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేకు టీచర్​ జాబ్​

డీఎస్సీ 1998 క్వాలిఫై అయినట్లు నాకు కూడా తెలిసింది. అప్పుడే ఉద్యోగం వచ్చుంటే ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవాడిని. ఇప్పుడేమో గడప గడపకు తిరుగుతున్నా. అప్పట్లో ఇంటర్వ్యూలో నేను క్వాలిఫై అయ్యా. అప్పుడే ఎలక్షన్ కోడ్​ రావడంతో అది ఆపేశారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదు. అప్పుడు అనేక వివాదాలతో వాయిదా పడింది. ఈరోజు జగన్ నిర్ణయంతో చాలామందికి మేలు జరిగింది.

-కరణం ధర్మశ్రీ, వైకాపా ఎమ్మెల్యే

డీఎస్సీ రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలని ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని కలలు కన్నానని.. అప్పట్లో పోస్టు వస్తే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. సమాజ సేవకు ఉపాాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని.. అప్పట్లో ఉద్యోగం వచ్చి ఉంటే బడి బడికి తిరిగేవాడినని తెలిపారు. ఇప్పుడేమో ఎమ్మెల్యేగా గడప గడపకు తిరుగుతున్నానని అన్నారు. డీఎస్సీ 1998 బ్యాచ్ తరపున సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details