తెలంగాణ

telangana

ప్రత్యేక కథనం: ఎదురుచూపులు.. ఇంకిన కన్నీళ్లు..

మహానగర పరిధిలోని ఏ పోలీస్‌స్టేషన్లకు వెళ్లినా పదుల సంఖ్యలో 'కనిపించడం లేదు' అంటూ వందలాది చిత్రాలతో గోడప్రతులు కనిపిస్తాయి. కొన్నిచోట్ల అయితే.. ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమానం ఇస్తామంటూ పేర్కొంటారు. మరికొన్ని ఫొటోల కింద బంధువులు పేర్కొనే వ్యాఖ్యలు చదివే వారి హృదయాలను ద్రవింపజేస్తాయి. నగరంలో నవంబరులో కనిపించకుండా పోయిన 40 మందిలో 11 మంది మైనర్లు, 14 మంది మహిళలు ఉండడం గమనార్హం. వీరంతా ఏమయ్యారు.. ఎక్కడకు వెళ్లారనేది అంతుచిక్కని ప్రశ్నే.

By

Published : Dec 3, 2019, 5:41 PM IST

Published : Dec 3, 2019, 5:41 PM IST

missing cases in hyderabad and state
ప్రత్యేక కథనం: ఎదురుచూపులు.. ఇంకిన కన్నీళ్లు..


ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేవలం పది రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది అదృశ్యమవడం కలకలం రేపింది. వీరిలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే 303 మంది ఉండడం గమనార్హం. మహిళలు 276 మంది, బాలికలు 55, బాలురు 26, పురుషులు 183 మంది ఉన్నారు. 222 మంది ఆచూకీ లభించింది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక్క నవంబరులోనే 38-40 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 60 మంది కనిపించకుండా పోతుంటే.. వారిలో అధికశాతం గ్రేటర్‌ పరిధిలోని వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

పొట్టకూటికి నగరానికి చేరింది ఆ కుటుంబం. ఆ ఇంటికి చెందిన బాలిక(16) చదువుకుంటూనే టీ స్టాల్‌లో తల్లికి సాయపడేది. ఓరోజు రాత్రి తల్లితో కలసి వెళుతూ రెప్పపాటులో మాయమైంది. వెతికినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి 11 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడ్డ కనిపిస్తుందని గంపెడాశతో ఇంటికెళ్లిన ఆ తల్లికి మరుసటి రోజు గుండె పగిలే వార్త తెలిసింది. ఖాళీ స్థలంలో ఓ మృతదేహం ఉందన్నది సమాచారం. అక్కడికెళ్లిన ఆ కన్నతల్లి కుప్పకూలింది. బలమైన గాయాలతో కుమార్తె నిర్జీవంగా పడిఉండడం చూసి బోరుమంది.

పిల్లల కోసం తల్లి.. కూతురు కోసం తండ్రి

‘భర్తతో తాను విడిగా ఉంటున్నా. తనను నమ్మించి పిల్లలను చెన్నైకి తీసుకెళ్లిన భర్త ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో ఓ గృహిణి గతేడాది మే నెలలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదు. మరో మహిళ వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంటి నుంచి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ మహిళ తండ్రి ఫిర్యాదు చేసి నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఆచూకీ చిక్కలేదని తండ్రి వాపోయారు.

"యుక్తవయసు ఆడపిల్లలు మాయమైతే సజీవంగా ఇల్లు చేరేంత వరకూ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండడంలేదు. అదృశ్యం కేసుల్లో అధికశాతం మహిళలు, యువతులే ఉండగా సగం మంది ఆచూకీ మాత్రమే లభిస్తోంది. మిగిలిన వారు వెతుకులాట పోలీసులకు సవాలుగా మారుతోంది."

  • మా నాన్న బుద్దరాజు సత్యనారాయణరాజు(78)కు మానసిక స్థితి సరిగా లేదు. గతంలో ఒకసారి తప్పిపోతే పోలీసులు పట్టుకొని అప్పజెప్పారు. ఈ ఏడాది జూన్‌ 21న ఇంటి నుంచి వెళ్లి ఇంతవరకు రాలేదు. ఆచూకీ లభిస్తే ఈసారి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. - వీఎస్‌ రాజు, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌
  • ఇంద్రానగర్‌ గుడిసెల్లో నివాసముంటున్న ఎ.గీత(40) 2017 మేలో ఇంటినుంచి వెళ్లింది. కూలీ పని చేసుకునే ఈమె ఆచూకీ రెండున్నరేళ్లయినా దొరకలేదు. ఇప్పటికీ తల్లి జయమ్మ బాలానగర్‌ పోలీసులను తరచూ అభ్యర్థిస్తూనే ఉంది. ఎక్కడికెళ్లిందన్నది అర్థం కావడంలేదని రోజు ఆమె గురించే ఆలోచిస్తున్నామని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజు కాలనీకి చెందిన సంజీవరావు(36) మూడు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదు. భార్య కరుణశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని ఆచూకీ లభ్యం కావడంలేదు.

మీకు తెలుసా
ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేవలం పది రోజుల వ్యవధిలో గ్రేటర్‌లోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 303 మంది అదృశ్యమయ్యారు.

పోలీస్​ స్టేషన్లలో కేసుల వివరాలు...

కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో వ్యక్తిగత ఇష్టాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. యువతులు, వివాహిత మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. కొందరు యువతులు లేఖలు రాసి వెళుతున్నారు. హయత్​నగర్​ ఠాణా పరిధిలో ఆచూకీ దొరకని వారిలో వృద్ధులు, అనాధాశ్రమాల నుంచి పరారైన వారు ఎక్కువగా ఉంటున్నారు. వృద్ధుల్లో వినికిడి లోపాలు ఉండడం, చిరునామా చెప్పలేకపోవడం వల్ల పట్టుకోవడం ఒకింత కష్టసాధ్యమవుతోంది. అదృశ్యమైన మహిళలు, యువతుల ఆచూకీ తెలుసుకుని అప్పగించడంలో లాలాగూడ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016-2019 మధ్య మహిళలు, యువతులు, బాలికలు అదృశ్యమైన కేసులు 69 నమోదు కాగా ఒక్కటి మాత్రమే అపరిష్కృతంగా ఉండిపోయింది. మల్కాజిగిరి ఠాణా పరిధిలో 2019లో ఇప్పటి వరకూ 134 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. వీరిలో 64 మంది మహిళలు ఉండగా, 20 శాతం మంది యువతులే కావడం గమనార్హం.

ఆమెకే.. ఎందుకీ కష్టం

పశ్చిమ మండలంలో కీలకమైన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీరిలో మహిళలు, యువతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. జూబ్లీహిల్స్‌ పరిధిలో గత నాలుగేళ్ల కేసులను పరిశీలిస్తే అదృశ్యాలు తగ్గుతూ వస్తున్నాయి. కేసుల్లో 90 శాతానికి పైగా ఆచూకీని గుర్తిస్తున్నారు. నాలుగేళ్లలో దాదాపు 546 కేసులు నమోదవగా 20 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.

ఇటీవల శంషాబాద్‌ వద్ద 'దిశ' అనే యువ వైద్యురాలు దారుణ హత్యాచారానికి గురైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో తానున్న పరిస్థితిని ఆమె తన చెల్లికి ఫోన్‌ ద్వారా వివరించింది. చుట్టూ దెయ్యాలంటి కుర్రాళ్లు ఉన్నారని భయమేస్తోందని తెలిపింది. అంతలోనే ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావటంతో కుటుంబ సభ్యులు వరుసగా రెండు పోలీసుస్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడ జరిగిన ఆలస్యంతో ఆ వైద్యురాలు మరుసటి రోజు నిర్జన ప్రదేశంలో కాలిన దేహంగా కన్పించింది.

భర్త ఆచూకీ తెలపరూ: భార్య

వరంగల్‌ జిల్లా మేడారం జాతర బందోబస్తుకని 2016 ఫిబ్రవరి 13వ తేదీన వెళ్లిన హోంగార్డు మహ్మద్‌ ఇబ్రహీం(45) ఆచూకీ నేటికీ తెలియలేదు. మూడేళ్లుగా జాడ లేకపోవడం వల్ల అతని కుటుంబం కుంగిపోయింది. అదే ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన భార్య సలీమా బేగం ఫిర్యాదుతో చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషనులో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఎలాగైనా తన భర్తను వెతికిపెట్టాలని వేడుకున్నారు. చాంద్రాయణగుట్ట పోలీసులు వరంగల్‌ వెళ్లి అక్కడి పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. అన్ని చోట్లా వెతికినా నేటికీ ఆచూకీ లభించలేదు.

ఇవీ చూడండి: బడి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు..

ABOUT THE AUTHOR

...view details