తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2020, 2:17 PM IST

ETV Bharat / city

పీపీఏ, జలవనరుల శాఖ మధ్య కుదరని ఏకాభిప్రాయం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనా విషయంలో ఈ ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ), ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. 2017-18 అంచనా ప్రకారం ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందనేది పీపీఏ నిర్ణయంగా కాకుండా... ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయంగా ముసాయిదా మినిట్స్‌లో పేర్కొంది. దీనిపై జల వనరులశాఖ అభ్యంతరం వ్యక్తం చేసి దీనిని పీపీఏ అభిప్రాయంగా మార్చాలని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

పీపీఏ, జలవనరుల శాఖ మధ్య కుదరని ఏకాభిప్రాయం
పీపీఏ, జలవనరుల శాఖ మధ్య కుదరని ఏకాభిప్రాయం

జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణానికి 2013 - 14 అంచనాల ప్రకారమే చెల్లిస్తామని, 2017 - 18 ధరల ప్రకారం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న పీపీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2014 మార్చి తర్వాత అయ్యే వ్యయాన్ని నూరు శాతం భరిస్తామని కేంద్రం చెప్పిందని... పీపీఏ, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదించిన 2017-18 ధరలను ఇస్తేనే పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు వాదించారు.

కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన 2013-14 ధరలనే పరిగణనలోకి తీసుకోవాలని, దానికే అంగీకారం తెలపాలని పీపీఏ అధికారులు చెప్పగా... చివరకు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 2017-18 ధరలతోనే సాధ్యమవుతుందని కేంద్ర జల సంఘం సభ్యుడు పేర్కొన్నారు. దాంతో మధ్యేమార్గంగా ఓ అంగీకారానికి వచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు తెలిపాయి.

దీని ప్రకారం 2013-14 ధరలను తాగునీటి సరఫరాకయ్యే ఖర్చును కలిపి ఆమోదిస్తూనే, ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 ధరలను ఇవ్వాలనేది పీపీఏ అభిప్రాయంగా కేంద్రానికి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగినట్లుగా పేర్కొన్నాయి.

అయితే సోమవారం పీపీఏ నుంచి అందిన ముసాయిదా మినిట్స్‌లో ఇందుకు భిన్నంగా 2017-18 ధరలను ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లుగా ఉండటంతో రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. ఇలా అయితే నేరుగా ఆంధ్రప్రదేశ్‌ తరపునే కేంద్రానికి లేఖ రాసే వాళ్లం కదా... పీపీఏ సమావేశం ఎందుకు అని ప్రశ్నించినట్లు చెబుతున్నాయి.

సమావేశంలో నిర్ణయించినట్లుగా 2017-18 ధరలు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమనేది పీపీఏ అభిప్రాయంగా మినిట్స్‌లో మార్పు చేయాలని కోరినట్లు పేర్కొన్నాయి. దీంతో పాటు ముసాయిదా మినిట్స్‌లో మరికొన్ని మార్పులను జలవనరుల శాఖ సూచించనున్నట్లు చెప్పాయి. తాగునీటి సరఫరాకి అయ్యే ఖర్చును కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మినహాయించగా, అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో తాగునీటికి అయ్యే వ్యయం కూడా భాగంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ వాదించింది.

జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఏ సిఫార్సు వెళ్తుంది?

2017-18 ధరల ప్రకారం జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదించిన అంచనా వ్యయంలో రూ.7200 కోట్లను తాగునీటి సరఫరాకు కేటాయించింది. ఈ మొత్తం విషయంలో కూడా పీపీఏ, జలవనరుల శాఖ మధ్య భిన్నాభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమంగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఏ సిఫార్సు వెళ్తుందన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే పుష్కరస్నానం..

ABOUT THE AUTHOR

...view details