తెలంగాణ

telangana

ETV Bharat / city

ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ మళ్లీ పాత అబద్ధాలే చెప్తున్నారు: నిరంజన్‌రెడ్డి - telangana paddy procurement

తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్​ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్లపై మళ్లీ పాత అబద్ధాలే చెప్తున్నారని మండిపడ్డారు. సభ సాక్షిగా కొందరు సీఎంలు బెదిరించారని చెప్పడం దారుణమని అన్నారు.

Niranjan reddy
Niranjan reddy

By

Published : Apr 1, 2022, 5:12 PM IST

Updated : Apr 1, 2022, 5:36 PM IST

పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ మళ్లీ పాత అబద్ధాలే చెప్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి మండిపడ్డారు. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికమని అన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టారని గుర్తుచేశారు. మరి నాడు మోదీ చేసింది బెదిరింపేనా అని ప్రశ్నించారు.

కేంద్రం కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగ విరుద్ధమని నిరంజన్​ రెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్ గోయల్​కు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. రైతులకు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్​లో రాష్ట్రాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకుని... బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గమని మండిపడ్డారు.

'తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్​కు అనుకూలంగా ఉన్న ధాన్యం మాత్రమే పండుతాయి. ఇది కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఉన్న ప్రత్యేక పరిస్థితి. రా రైస్ చేస్తే వచ్చే నష్టాన్ని కేంద్రం ఎందుకు భరించదు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడదు? పార్లమెంటు సాక్షిగా దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు? నేరుగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసి దానిని రా రైస్​గా చేసుకుంటారో ? బాయిల్ చేసుకుంటారో ? వారి ఇష్టం.'- నిరంజన్​ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

అన్ని రాష్ట్రాలకూ ఒకే గైడ్ లైన్స్ అని పీయూష్ గోయల్ చెప్పడం విడ్డూరమని నిరంజన్​ రెడ్డి అన్నారు. భిన్న పరిస్థితులున్న రాష్ట్రాలకు ఒకే నిబంధనలు విధించి.. దానికి సమానత్వం అని పేరు పెట్టడం మూర్ఖత్వమని విమర్శించారు. ఈ విషయాన్ని వదిలేసి కేంద్రం మొండిగా తెలంగాణలో రా రైస్ అనే పేరుతో వరి ధాన్యం కొనం అని పరోక్షంగా చెప్పడం దారుణమని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్లపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు అవివేకమని నిరంజన్​ రెడ్డి విమర్శించారు. ఐదేళ్లు పౌరసరఫరాల మంత్రిగా పనిచేసిన వ్యక్తి, కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు తెలిసిన వ్యక్తి ఇలా మాట్లాడడం బాధాకరం, బాధ్యతారాహిత్యమని అన్నారు. తెలంగాణ రైతుల గురించి కేంద్రాన్ని ఒప్పించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనడం సిగ్గుచేటని తెలిపారు.

సంబంధిత కథనం:ఒప్పందం మేరకే ఉప్పుడు బియ్యం కొంటాం: కేంద్రమంత్రి పీయూష్ గోయల్​

Last Updated : Apr 1, 2022, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details