తెలంగాణ

telangana

ETV Bharat / city

'జాతి సంపద పెంచుతున్నాం.. కేంద్రం చేయూతనివ్వాలి'

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కేంద్రం దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరి ధాన్యంలో 56 శాతం పైగా తెలంగాణ నుంచే సేకరించిందన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఐదేళ్లుగా గోదాముల నిర్మాణం చేపట్టారని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

By

Published : Jul 10, 2020, 6:15 PM IST

Updated : Jul 10, 2020, 7:19 PM IST

niranjanreddy
niranjanreddy

జాతి సంపద పెంచే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. తెరాస ప్రభుత్వ ఊతంతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని కేంద్ర మంత్రికి నిరంజన్ రెడ్డి వివరించారు.

501 సంఘాలున్నాయి

రాష్ట్రంలోని ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఆ మూడు జిల్లాలు ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నందున వేరుశనగ, వరి, మామిడి వంటి పంటలకు అనువుగా ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ తెలంగాణలో వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలను కూడా అదనంగా చేర్చాలని మంత్రి విన్నవించారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఒకటి లేదా రెండు ఎఫ్ఏఓల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. ఇప్పటికే సమర్థవంతంగా 501 సంఘాలు నడుస్తున్నాయని చెప్పారు.

89 శాతం మందికి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నాం. పంట రుణాలు తీసుకున్న 41.61 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద లబ్ధిపొందుతున్న 36.79 లక్షల మంది రైతుల కన్నా ఇది అధికం. రైతుబంధు పథకం కింద పంటకు పెట్టుబడి ఇచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తున్నాం. ఈ వానాకాలంలో బ్యాంకు ఖాతాలు నమోదు చేసుకున్న రైతులకు రూ.7253.54 కోట్లు జమ చేశాం. గత నాలుగేళ్లలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద అన్ని రాష్ట్రాలకు కలిపి వ్యవసాయ రంగానికి కేంద్రం రూ.లక్ష కోట్లు వడ్డీ రాయితీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ గ్రాంటుగా ఇస్తే బాగుండేది.

- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

సాగు విస్తీర్ణం పెరిగింది...

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి వివరించారు. ఈ ఏడాది కేంద్రం దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరి ధాన్యంలో 56 శాతం పైగా తెలంగాణ నుంచి సేకరించిందన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఐదేళ్లుగా గోదాముల నిర్మాణం చేపట్టారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష కల్లాలు నిర్మిస్తుండమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ 400 నుంచి 1,000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. స్థలాల గుర్తింపునకు రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. స్థానిక మార్కెట్లను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం కోసం శీతల గిడ్డంగులు, ప్యాక్ హౌస్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

Last Updated : Jul 10, 2020, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details