రాష్ట్రంలో వంద శాతం ఎరువుల వినియోగం పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన నిరంజన్రెడ్డి... కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానంద గౌడతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాపై కేంద్రమంత్రితో చర్చించారు. రాష్ట్రంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదన్నారు. కొవిడ్, వర్షాల వల్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నా కొరత రాకుండా చూస్తున్నామని మంత్రి వివరించారు.
ఆగస్టు కోటా పూర్తిగా విడుదల చేయండి: మంత్రి నిరంజన్రెడ్డి
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో ఢిల్లీలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేటాయించాల్సిన ఎరువులపై కేంద్ర మంత్రితో చర్చించారు.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఇప్పటికే కోటి 24 లక్షలకు చేరిందన్న మంత్రి నిరంజన్రెడ్డి... మరో ఆరేడు లక్షల ఎకరాల్లో వరి నాట్లు జరగాల్సి ఉందని వివరించారు. మరో ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని తెలిపారు. మొత్తం కోటి 40 లక్షల ఎకరాలకు ఎరువులు అవసరమని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం 22 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిందని మంత్రి తెలిపారు. అందులో పదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా .. మిగతా ఎరువులు.. మరో 11 లక్షల మెట్రిక్ టన్నులని వివరించారు. మంచి వర్షాల వల్ల ఆగస్టు కోటా పూర్తిగా విడుదల చేసేలా చొరవ చూపాలని కేంద్రమంత్రిని కోరినట్లు నిరంజన్రెడ్డి వెల్లడించారు.