తెలంగాణ

telangana

ETV Bharat / city

మా నినాదం విశ్వనగరం.. భాజపాది విద్వేష నగరం: కేటీఆర్​ - సనత్​నగర్​లో కేటీఆర్​ రోడ్​ షో

భాజపా నాయకులకు విషయం లేదు... కేవలం విషం మాత్రమే ఉందని కేటీఆర్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి హైదరాబాద్​ శత్రుదేశంలా కనిపిస్తుందా అని భాజపా నాయకులను నిలదీశారు.

minister ktr greater elections road show in sanath nagar
మా నినాదం విశ్వనగరం.. భాజపాది విద్వేష నగరం: కేటీఆర్​

By

Published : Nov 29, 2020, 5:09 PM IST

Updated : Nov 29, 2020, 5:41 PM IST

తమ నినాదం విశ్వనగరమైతే... భాజపాది విద్వేష నగరమని కేటీఆర్​ విమర్శించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ శాంతినగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. భాజపా వాళ్లకు ఏ మాత్రం విషయం లేదు... కేవలం విషం మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. దిల్లీ నుంచి 15 మంది వరకు ఉత్త చేతుల్తో ప్రత్యేక విమానాల్లో వస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతికి తట్టెడు మట్టి తెచ్చారు కానీ... హైదరాబాద్​కు అది కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌వా? పార్టీ ప్రెసిడెంట్‌వా?

ఐటీ హబ్​ తీసుకొస్తామంటున్న అమిత్​ షా నగరానికి రూపాయి ఇవ్వకపోగా రుబాబు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీని మరింత అభివృద్ధి చేస్తామంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. యూపీఏ హయాంలో నగరానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రద్దు చేసిన మీరే ఐటీ హబ్‌గా మారుస్తామంటే ఇక్కడ నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. వరదల్లో ద్విచక్ర వాహనాలు పాడైతే ఇన్స్యూరెన్స్‌ పరిహారం ఇప్పిస్తామంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ వ్యంగ్యంగా స్పందించారు. ఇన్సూరెన్స్‌ పరిహారాన్ని ఆయా సంస్థలే ఇస్తాయని.. మీరిచ్చేదేంటని ప్రశ్నించారు. ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌వా? పార్టీ ప్రెసిడెంట్‌వా? అంటూ పరోక్షంగా సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శత్రుదేశాలపై చేసేవాటని సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటారని.. హైదరాబాద్‌ శత్రుదేశంలా కనిపిస్తోందా?అని ప్రశ్నించారు. ఎక్కడ మత ఘర్షణలు జరిగాయని అమిత్‌షా ప్రశ్నిస్తున్నారని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో దిల్లీలో జరగలేదా? అని నిలదీశారు

ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వస్తున్నారు..

గోషామహల్‌ నియోజకవర్గంలోని జుమ్మేరాత్‌ బజార్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్న కేటీఆర్​.. నోటికొచ్చిన హామీలిస్తూ భాజపా నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు రాల్చుకోవాలని కుట్ర చేస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెచ్చి.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. ఆ పని చేశారా? అని ప్రశ్నించారు. ఒక వేళ మీ ఖాతాల్లో రూ.15 లక్షలు పడితే భాజపాకే ఓటేయండి.. లేదంటే తెరాసకు ఓటేయండి అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. ఇవాళ రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వస్తున్నారు. కేసీఆర్‌ రాకముందు.. వచ్చాక.. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బేరీజు వేసి పరిశీలించండి. ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎలాంటి అల్లర్లు లేవు. రౌడీ షీటర్లు లేరు.. గుండాలు లేరు. వరదలు వచ్చినప్పుడు దిల్లీ నేతలు ఒక్కరు కూడా హైదరాబాద్‌ రాలేదు. సాయం అడిగినా అందించలేదు. వర్షాలు, వరదలతో హైదరాబాదీలు తల్లడిల్లుతుంటే వారిని ఆదుకున్నది తెరాస ప్రభుత్వమే. వరదల సమయంలో రానివారు ఎన్నికలు అనేసరికి దిల్లీ నుంచి వచ్చారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఒక్కడే. వరద సాయం అందనివారికి డిసెంబర్‌ 7 తర్వాత ఇస్తాం’’ - కేటీఆర్‌

ఇదీ చూడండి:ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​

Last Updated : Nov 29, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details