నూతన పురపాలక చట్టాన్ని క్షుణ్ణంగా చదువుకుని రంగంలోకి దిగాలని కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అవినీతి రహిత సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ బాటలో నడవాలన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లతో సమావేశమయ్యారు. జడ్పీల్లో నూటికి నూరు శాతం సీట్లు సాధించి దేశంలోనే ఓ చరిత్ర సృష్టించామన్న మంత్రి... మున్సిపల్ ఎన్నికల్లో మెుత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 122 పురపాలక, నగరపాలక సంఘాల్లో విజయం సాధించడం మరో చరిత్రగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు శత విధాల ప్రయత్నించాయని దుయ్యబట్టారు.
ఉత్తమ్ ప్రిపేర్ కాలేదన్నారు..
ఆనాడు అసెంబ్లీలో ఉత్తమ్ తాను ప్రిపేర్ అయి రాలేదన్నారని... ఎన్నికలకు కూడా కాంగ్రెస్ సిద్ధం కాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో తెరాస విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు కాంగ్రెస్, భాజపా నేతలు మాట్లాడుతున్నారని, ఇది ఓట్లేసిన ప్రజలను అవమానపర్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలు తాము పట్టించుకోమని, మీరు పట్టించుకోవద్దని మంత్రి మేయర్లు, ఛైర్మన్లకు సూచించారు.