తెలంగాణ

telangana

By

Published : May 13, 2021, 7:30 PM IST

Updated : May 13, 2021, 10:00 PM IST

ETV Bharat / city

'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'

మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ ద్వారా నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొవిడ్​ సమయంలో తానూ అనారోగ్యం పాలైనట్లు తెలిపిన కేటీఆర్​... ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, కోలుకున్న తీరు నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల లభ్యతే సవాలుగా మారిందన్న మంత్రి.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మెల్లగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చారు.

minister ktr answers in ask ktr on twitter
minister ktr answers in ask ktr on twitter

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రజల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీరామారావు తెలిపారు. ఆస్క్ కేటీఆర్ పేరిట ట్విట్టర్ ద్వారా కొవిడ్​కు సంబంధించి నెటిజన్లు వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేసుల వివరాలు, ఆసుపత్రుల్లో చేరికల సంఖ్య ఆధారంగానే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతోందని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. మొదటి వేవ్​తో పోలిస్తే రెండో దశ నాటికి రాష్ట్రంలో పడకలు, సదుపాయాలు గణనీయంగా పెంచినట్లు వివరించారు. వ్యాక్సినేషన్ విషయంలో దేశ సగటు కంటే రాష్ట్ర సగటు మెరుగ్గా ఉందని... అయితే వ్యాక్సిన్ల లభ్యతే సవాలుగా మారిందని చెప్పుకొచ్చారు. పదిలక్షల మందికి దేశ సగటు వ్యాక్సినేషన్ 1,29,574 ఉండగా... తెలంగాణ సగటు వ్యాక్సినేషన్ 1,41,939 ఉందని పేర్కొన్నారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న వినతిపై...
బెడ్లు సమకూర్చటంపై వివరణ

రెండో డోస్​ వారికే ప్రాధాన్యత...

ప్రస్తుతం రెండో డోస్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న కేటీఆర్... కేంద్రం నుంచి టీకాలు ఎక్కువగా పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. టీకాల ఉత్పత్తిదారులతోనూ మాట్లాడుతున్నామని... భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, రెడ్డీస్ ల్యాబ్స్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. జూలై చివర్లో లేదా ఆగస్టు మొదట్లో డిమాండ్​కు తగ్గట్లు టీకాలు సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. వీలైనన్ని ఎక్కువ టీకాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న కేటీఆర్... రోజుకు తొమ్మిది లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఫైజర్, మోడెర్నా టీకాలను కూడా త్వరలో అనుమతించవచ్చని... ఆగస్టు నాటికి బీఈ నుంచి కూడా స్వదేశీ టీకా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

రాజకీయం తగదు...

దేశంలో ఈ ఏడాది మొత్తం వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, నీతిఆయోగ్ ప్రకారం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. సరిపడా టీకాలు అందుబాటులో ఉంటే రాష్ట్రమంతా 45 రోజుల్లో వ్యాక్సినేషన్ వేసే వనరులు, సామర్థ్యం ఉందన్నారు. టీకాల విషయంలో ప్రాంతీయతత్వం సరికాదన్నారు. మన రాష్ట్రంలో తయారవుతున్నంత మాత్రాన మొదటి హక్కు మనకే ఉండదని స్పష్టం చేశారు. మహమ్మారిని కూడా రాజకీయం చేయడం తగదన్న కేటీఆర్​... టీకాల కోసం గ్లోబల్ టెండర్ల విషయంలో విమర్శలు చేయటాన్ని వారి విజ్ఞతకే వదిలేద్దామని వ్యాఖ్యానించారు.

రాజకీయం తగదంటూ...

రెమ్​డెసివిర్​పై స్పష్టమైన ఆదేశాలు...

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమ్​డెసివిర్ వినియోగంపై ఆడిటింగ్ చేస్తున్నామని... కొన్ని చోట్ల అవసరం లేకున్నా ఇంజక్షన్లు వాడుతున్నట్లు గుర్తించి వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్​కు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స తక్కువ ధరకు అందాల్సిన అవసరం ఉందని... ఈ విషయమై దృష్టి సారిస్తామని కేటీఆర్ తెలిపారు. చిన్నారులకు ఇంకా టీకాలు వేయనందున ఆన్​లైన్ విద్య మరికొన్నాళ్ల పాటు తప్పదని అభిప్రాయపడ్డారు.

బ్లాక్​ మార్కెట్​పై చర్యలు తీసుకుంటున్నామని...

త్వరలోనే ప్లాస్మాదానం...

కొవిడ్ సమయంలో వారం పాటు తనకు జ్వరం ఉందని... ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కూడా వచ్చిందని నెటిజన్లతో పంచుకున్నారు. షుగర్ ఉండడం వల్ల బీపీ నియంత్రణ సవాలుగా మారిందని... వైద్యుల సూచనలు, సలహాలతో కోలుకున్నట్టు కేటీఆర్‌ వివరించారు. త్వరలోనే ప్లాస్మా దానం చేయనున్నట్లు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా విరాళం ఇచ్చిన 90 అంబులెన్సులు కొవిడ్ మహమ్మారి సమయంలో చాలా ఉపయోగపడుతున్నాయని కేటీఆర్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టు అవుతుందని తెలిపారు. కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:మే 31 వరకూ సెకండ్‌ డోస్‌ వారికే వ్యాక్సిన్‌: డీహెచ్‌

Last Updated : May 13, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details