రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ను రాష్ట్ర మంత్రి హరీశ్రావు కోరారు. ఉత్తరప్రదేశ్లోని లక్నవూలో జరిగిన జీఎస్టీ మండలి 45వ సమావేశంలో పాల్గొన్న మంత్రి... ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ అందించారు. 2018-19కి సంబంధించి ఐజీఎస్టీ పరిహారంలో రాష్ట్రానికి రావాల్సిన 210 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పది నుంచి 33కు పెరిగిన నేపథ్యంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తొమ్మిది పాత జిల్లాలకు కాకుండా హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాన్ని 2021-22 నుంచి మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని కోరారు. 2019-20, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బీఆర్జీఎఫ్ నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు.
నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి...
2020-21కి సంబంధించి 15వ ఆర్థికసంఘం గ్రాంటుగా సిఫారసు చేసిన 723 కోట్ల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థికసంఘం సిఫారసులను గౌరవించి నిధులు ఇవ్వాలని హరీశ్రావు కోరారు. గ్రాంటు ఇవ్వరాదన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి... రాష్ట్రానికి 723 కోట్లు ఇవ్వాలన్నారు. కొత్త రాష్ట్రానికి నిధుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రికి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. పత్తిపై రివర్స్ ఛార్జ్ మెకానిజం - ఆర్సీఎంను ఎత్తివేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరిన ఆయన... ఈ విషయంలో పత్తిసాగు చేసే ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో చర్చించాలని సూచించారు.