ప్లాస్మా కరోనా బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్లాస్మాదాతలకు నిర్వహించిన సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం కరోనాకు మందులేని పరిస్థితుల్లో అందరిలో అయోమయం నెలకొందని చిరంజీవి అన్నారు. కరోనా రోగులకు.. ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా రోగులు కోలుకుంటారని చిరు పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల.. రక్తం నష్టం అనేది ఉండదన్నారు. రక్తంలో ప్లాస్మా 24 నుంచి 48 గంటల్లో తిరిగి తయారవుతుందని వివరించారు. ప్లాస్మా దానంతో ఒక వ్యక్తి 30 మందికి ప్రాణదానం చేయవచ్చని చిరంజీవి అన్నారు.
చిరు ఇంట్లోనే నలుగురికి కరోనా..
ప్రతి ఒక్కరూ.. ప్రతి క్షణం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మెగాస్టార్ సూచించారు. తన ఇంట్లో పనిచేసే నలుగురు వ్యక్తులకు కూడా కరోనా వచ్చిందని వెల్లడించారు.