తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడమే లక్ష్యమా..?: లోకేశ్‌

వరద బాధితుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మానవత్వం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. వర్షాలు, వరదలతో రైతులకు భారీ నష్టం జరిగిందని... వారికి కనీసం నిత్యావసరాలు కూడా అందించలేదని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లేని రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యంగా జగన్​ పాలన సాగిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఏడాదిన్నరలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమేనా రైతురాజ్యమని ప్రశ్నించారు.

By

Published : Oct 30, 2020, 3:28 PM IST

lokesh-comments-on-farmers
రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడమే లక్ష్యమా..? : లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హితవు పలికారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని, జగన్ ప్యాలెస్​లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలే కానీ మీటర్లను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకి సైకిళ్లకు కట్టి ఊరేగిస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉంది తానో.. చంద్రబాబో ఇంకా అర్ధంకాని హ్యాoగోవర్​లో జగన్ ఉన్నారని లోకేశ్‌ విమర్శించారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటా అన్న మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని మండిపడ్డారు. చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి 30వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు.

ఏడాదిన్నరలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమని లోకేశ్‌ నిలదీశారు. నష్టం అంచనా 100 శాతం చేసి ఎకరాకు 25వేలు రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు 5లక్షల రూపాయల చెల్లించాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 5వేలు పరిహారం ఇవ్వాలన్నారు.

జగన్​ని గోచీతో నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది...

రైతులను ఎగతాళి చేస్తే జగన్​ను గోచీతో నిలబెట్టే రోజు దగ్గరలో ఉందన్నారు. తాను ఏ హోదాతో తిరుగుతున్నానని ప్రశ్నిస్తున్న మంత్రులు.. మానవత్వంతో తిరుగుతున్నానని గుర్తించాలన్నారు. గాల్లో తిరిగే ముఖ్యమంత్రిని ఏమనాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎక్కడా ఆదుకునే పరిస్థితిలో లేదని అన్నారు.

రైతులకు కులం అంటగట్టిన చరిత్ర జగన్​ది...

ఉభయ గోదావరి జిల్లాల్లో 3సార్లు పంట మునిగిందని, ఏపీని రైతుల్లేని రాజ్యంగా జగన్ తయారు చేశారని మండిపడ్డారు. ఇన్​పుట్ సబ్సిడీ వరద ముంపునకు గురైన 5 జిల్లాల్లో ఎక్కడా అందలేదన్న ఆయన..., రైతు రాజ్యం ఎలా అవుతుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసాను 14లక్షల మందికి కుదించారని, మిగిలిన వారంతా వ్యవసాయం వదిలేసిన వారా? అని ప్రశ్నించారు. 15 లక్షల మంది కౌలు రైతులుంటే కేవలం 41వేల మందికి మాత్రమే రైతు భరోసా వర్తింపచేశారని మండిపడ్డారు. 5 ఏళ్లకు 25వేల కోట్ల రూపాయలు మేర రైతుల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. రైతులకు కూడా కులం అంటగట్టిన చరిత్ర జగన్‌దని లోకేశ్‌ ఆక్షేపించారు. సున్నా వడ్డీ లబ్ధిదారులను సున్నా చేశారని లోకేశ్‌ మండిపడ్డారు.

తనపై ఏమీ లేదని తేలాకే... ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు

ట్రాక్టర్​తో కూడా రాష్ డ్రైవింగ్ చేయొచ్చని తనపై పెట్టిన కేసు చూశాకే తెలిసిందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తనపై తొలుత 6లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు చేశారని, తర్వాత లక్ష కోట్లే అన్నారని గుర్తు చేశారు. ఎక్కడా ఏమీ లేదని తెలిశాక ఫైబర్ గ్రిడ్​లో అవినీతి అన్నారని... అక్కడా ఏమీ లేదని తెలిసి చివరకు ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు పెట్టారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త నోటిఫికేషన్​తోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికలపై వైకాపా ఎమ్మెల్యేలు నాడు నేడు చెప్పిన మాటల్ని ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:అబద్ధాల పునాదులపై గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details