తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 10:49 AM IST

ETV Bharat / city

Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

ఆరుగాలం కష్టించి.. నిద్ర మానుకుని..నగరం బాట పడుతున్న కూరగాయ రైతును నష్టాలే పలకరిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావంతో విక్రయానికి సమయం సరిపోక బేరాలు సగంలోనే వదులుకుని అయినకాడికి విక్రయించి తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మహా నగరం చుట్టుపక్కల రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో రైతులు నగరానికి కూరగాయలు తెస్తుంటారు. క్యారెట్‌ తదితర పంటలకు రైతులు ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. పంట దిగుబడి సరిగా లేక ఎకరాకు 30 నుంచి 40 బస్తాలు మేరకే వస్తున్నాయి. ధర లేకపోవడం, విక్రయాలు సరిగా సాగక చేతికి రూ.20వేలు కూడా రావడం లేదని వాపోతున్నారు.

lock down effect on vegetable farmers
lock down effect on vegetable farmers


ఉదయం నుంచి సాయంత్రం వరకు..

గతంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు నగరానికి వచ్చేవి. బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌, ఎన్టీఆర్‌నగర్‌ మార్కెట్లతోపాటు ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి రైతుబజార్లకు చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పంటను విక్రయించుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని వెనుదిరిగేవారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు సమయం సరిపోక.. విక్రయాలు సాగక.. ఖర్చులకు కూడా రావడం లేదని చెబుతున్నారు.

12 నుంచి 12 వరకు...

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చక్రంపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి నిత్యం కూకట్‌పల్లి రైతుబజారుకు వచ్చి క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటా, కొత్తిమీర తదితరాలు విక్రయిస్తుంటాడు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి 23 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం క్యారెట్‌ పంటను తీసుకుని వచ్చి కూకట్‌పల్లిలో అమ్ముకుంటున్నాడు. పంట విక్రయించడానికి పడుతున్న ఇబ్బందులు వివరించారు.

*నిద్ర లేచి సరకు రవాణా చేసే ఆటోట్రాలీకి ఫోన్‌ చేయాలి. ఆటో ఇంటికి చేరుకునే సరికి కూరగాయలు నింపిన సంచులు సిద్ధంగా ఉంచుకోవాలి.

*ఇంటికి ఆటోట్రాలీ చేరుకుంటుంది. నాలుగు సంచుల క్యారెట్‌ బస్తాలు ట్రాలీలో లోడింగ్‌ చేసుకోవాలి.

*లోడింగ్‌ చేసిన ఆటో ట్రాలీతో కలిసి పక్కఊళ్లో ఉన్న మరో రైతు వద్దకు చేరుకుని అక్కడ బీట్‌రూట్‌ బస్తాలు, టమాటా బాక్సులు వేసుకుంటారు.

*లోడింగ్‌ పూర్తయ్యాక అన్నం బాక్సులు కట్టుకుని, మంచినీళ్ల సీసాలు పెట్టుకుని నగరానికి ప్రయాణమవుతారు.

* తెల్లవారు జామున:66 కిలోమీటర్లు ప్రయాణించి ట్రాలీ కూకట్‌పల్లి రైతుబజారుకు చేరుకుంటుంది. సాధారణంగా సీజన్‌లో కూరగాయలు దిగుబడి ఎక్కువ ఉంటే.. అక్కడే వేరొక వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం సీజన్‌ లేకపోవడంతో దిగుబడి సరిగా లేక రైతే సొంతంగా విక్రయించుకోక తప్పని పరిస్థితి.

*నాలుగు బస్తాల క్యారెట్‌ తీసుకుని స్టాల్‌/ప్రాంతంలో కూరగాయలు సర్దుకోవాలి. ఉదయం ఆరు గంటలు అయ్యే వరకు వేచి చూడాలి. కాసేపు కునుకు తీద్దామంటే..దోమలతో కంటిమీద రెప్పవాల్చలేని దుర్భరస్థితి.

*ఉదయం: కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. రైతు తీసుకువచ్చిన 4 సంచుల్లో(సంచికి 30 కిలోల చొప్పున) 120 కిలోల క్యారెట్‌ విక్రయించాలి.

* విక్రయాలు ఆపేసి తిరుగు పయనమవ్వాలి. అప్పటికీ నాలుగు బస్తాల్లో మూడు బస్తాలు(90 కిలోలు) అమ్మడం పూర్తయ్యింది. మరో బస్తా రైతు బజారులోనే భద్రపరుచుకొని బయల్దేరాలి.

*అక్కడే అన్నం తినేసి ఆటో ట్రాలీలో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు సొంతూరుకు చేరుకుంటారు.

క్యారెట్‌ కిలో రూ.10 చొప్పున విక్రయించడంతో రూ.900 చేతికి వచ్చాయి. ఇందులో ఒక్కో బస్తాకు రూ.60 చొప్పున ఆటోకు ఇవ్వాలి. ఇక రైతు చేతిలో మిగిలింది రూ.650. అర్ధరాత్రి నిద్ర మానుకుని వచ్చి అమ్మితే కనీసం రోజు గడిచే స్థాయిలో కూడా డబ్బులు చేతికి అందడం లేదు.


ఇదీ చూడండి:Doctors Deaths: కొవిడ్‌ రెండో దశలో 25 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details