తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 5:34 AM IST

Updated : Jun 3, 2020, 6:30 AM IST

ETV Bharat / city

రేపు కృష్టానదీ యాజమాన్య బోర్డు సమావేశం

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం గురువారం జరగనుంది. ఇరు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వచ్చిన ప్రాజెక్టుల డీపీఆర్​లు సహా ప్రస్తుత నీటి సంవత్సరానికి కేటాయింపులే ప్రధాన ఎజెండాగా చర్చించనుంది. నాలుగు సాంకేతిక అంశాలతోపాటు నిర్వహణాపరమైన అంశాలపై భేటీలో చర్చించనున్నారు.

krishna river managment board meeting tomarrow
రేపు కృష్టానదీ యాజమాన్య బోర్డు సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరస్పర ఫిర్యాదుల మధ్య కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం జరగనుంది. నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో రేపు ఉదయం 11 గంటలకు 12వ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశ ఎజెండాను సభ్య కార్యదర్శి మువాంతాంగ్ ఇరు రాష్ట్రాలకు పంపారు. ఎజెండా అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలకు గతంలోనే బోర్డు లేఖ రాసింది. ఎలాంటి స్పందనా లేనందున... బోర్డు ప్రతిపాదించిన ఎజెండాతోనే సమావేశానికి సిద్ధమైంది.

డీపీఆర్​ల సమర్పణ..

సమావేశంలో ప్రధానంగా... బేసిన్​లోని ప్రాజెక్టుల డీపీఆర్​లు సమర్పించడం, 2020-21 నీటి సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ అమలు, విద్యుత్ పంపకాలు సహా బోర్డు నిర్వహణకు సంబంధించిన 5 అంశాలను ఎజెండాలో చేర్చింది. కృష్ణాపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్​లు, వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు 2018 జూన్ 6న జరిగిన సమావేశంలో అంగీకరించినా... ఇప్పటి వరకు ఇవ్వలేదని బోర్డు తెలిపింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పరం ఫిర్యాదు చేసినందున... వాటికి సంబంధించిన డీపీఆర్​లు ఇవ్వాలని పదేపదే కోరుతున్నట్టు బోర్డు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 15 ప్రాజెక్టులు, తెలంగాణకు చెందిన 8 ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు వెల్లడించింది.

ఫిర్యాదులు చేసుకున్న ప్రాజెక్టులు

ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె ఎత్తిపోతల, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్దాపురం, శివభాస్యం, మున్నేరు, ఆర్డీఎస్ కుడికాల్వ, తుంగభద్రపై కొత్త ఎత్తిపోతల, వైకుంఠాపురం ఆనకట్ట, గోదావరి-పెన్నానది మొదటి దశ, వేదావతి, నాగులదిన్నె, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు సామర్థ్యం 80వేల క్యూసెక్కులకు పెంచడంపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్​ఎల్​బీసీ సామర్థ్యం పెంపుపై ఆంధ్రప్రదేశ్​ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

పులు అంశాలపై చర్చ

2020-21 నీటి సంవతర్సం జూన్ 1 నుంచి ప్రారంభమైనందున... రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై కూడా చర్చ జరగనుంది. 2019-20లో ఆంధ్రప్రదేశ్ 69.832 శాతం, తెలంగాణ 30.167 శాతం నీటిని వినియోగించుకున్నాయన్న బోర్డు... తెలంగాణకు ఇంకా 48.522 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్ లో 50.637 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలపై కూడా చర్చ జరగనుంది. నీటి వినియోగానికి సంబంధించిన గణాంకాల కోసం రెండో దశ టెలిమెట్రీ అమలు కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఈ దఫాలో తొమ్మిది చోట్ల టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితో పాటు బోర్డు నిర్వహణా సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు. బోర్డు బడ్జెట్, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు, అధికారులు, సిబ్బంది నియామకం తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి.

ఇదీ చూడండి:'జలదీక్ష' భగ్నం.. అడుగడుగునా అడ్డగింతలు, అరెస్టులు

Last Updated : Jun 3, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details