తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2021, 8:07 AM IST

ETV Bharat / city

తెదేపా నేత కళా వెంకటరావును అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు

తెలుగుదేశం సీనియర్‌ నేత కళా వెంకటరావును నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటన సమయంలో కారుపై దాడి చేశారన్న అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఆయనను విడుదల చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సహా... వైకాపా నేతలు ప్రజా భక్షకులుగా తయారయ్యారని కళా ధ్వజమెత్తారు.

తెదేపా నేత కళా వెంకటరావును అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు
తెదేపా నేత కళా వెంకటరావును అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు

తెదేపా నేత కళా వెంకటరావును అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావును ఏపీలోని విజయనగరం జిల్లా పోలీసులు.. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అదుపులోకి తీసుకున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్​బ్యూరో సభ్యుడు వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులోనే కళా వెంకటరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజాం పట్టణంలోకి రాత్రి 8 గంటల తర్వాత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి.. కళా వెంకటరావు నివాసాన్ని చుట్టుముట్టారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలిస్తుండగా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ఏం తప్పు చేశారని తీసుకెళుతున్నారని నిలదీశారు. రామతీర్థం ఘటనలో అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను బలవంతంగా పోలీసు జీపులోకి నెట్టేశారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 9.45 గంటలకు ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు.

కళాతో పాటు ఆయన పీఏ వెంకటనాయుడు, అనుచరుడు శంకరావును తీసుకెళ్లారు. చీపురుపల్లి, రాజాం ప్రాంతాల తెదేపా నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. కళాకు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు జారీ చేసి.. ఆయన్ను విచారించి రాత్రి 11.15 గంటల సమయంలో విడిచిపెట్టారు. రామతీర్థం ఘటనలో ప్రభుత్వం నిందితులను వదిలి.. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తోందని కళా వెంకటరావు ఆరోపించారు.

కళా వెంకటరావును అరెస్టు చేయలేదని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకే ఠాణాకు తీసుకొచ్చామన్నారు. ఇదే కేసులో నెల్లిమర్ల మండలానికి చెందిన తెలుగుదేశం నేత సువ్వాడ రవిశేఖర్‌తో సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్లో ఉంచారు.

ఇవీచూడండి:ఈజీ మనీ కోసం.. ఆన్​లైన్ బెట్టింగ్​ మాయలో పడుతున్న యువత

ABOUT THE AUTHOR

...view details