తెలంగాణ

telangana

ETV Bharat / city

'సిరివెన్నెల అక్షర కిరణాలు.. అందరిలో స్ఫూర్తినింపుతాయి' - సిరివెన్నెల రచనల అనుభవాన్ని పంచుకున్న పవన్

Pawan on Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా లేకపోయినా ఆయన సమాజానికి అందించిన అక్షర కిరణాలు అందరిలో స్ఫూర్తి నింపుతాయని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం' చూశాక 'రుద్రవీణ' చిత్ర విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల రచనల్లో ఆయనలోని సామాజిక బాధ్యత ప్రస్ఫుటమవుతుందని పేర్కొన్నారు.

Pawan
Pawan

By

Published : May 23, 2022, 10:36 PM IST

Pawan on Sirivennela: కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడని... సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా లేకపోయినా ఆయన సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పంచ భూతాల్లో కలసిపోయినా... రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఒక గొప్ప కవి అని కొనియాడారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం:సిరివెన్నెల జయంతి సందర్భంగా విడుదలైన 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం' మొదటి సంపుటిని చూశాక... ఆ అక్షర తపస్విని మొదటిసారి 'రుద్రవీణ' సినిమా సమయంలో కలిసిన సందర్భం గుర్తుకు వచ్చిందని పవన్​ అన్నారు. చిరంజీవి నటించిన, నాగబాబు నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి తాను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకున్నానని గుర్తుచేశారు. ఆ సందర్భంలో సిరివెన్నెలతో భేటీ అయ్యేవారిమని తెలిపారు.

ఆ చరణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది: 'రుద్రవీణ' చిత్రంలో 'చుట్టూపక్కల చూడరా చిన్నవాడా' పాటలో చివరి చరణం... ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటుందన్నారు. "నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది... గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది... ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే" అనే ఈ పంక్తులు తననెంతో ప్రభావితం చేశాయని పవన్​ తెలిపారు. ఇప్పటికీ తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. తనను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం తన విధిగా భావిస్తానని వివరించారు.

వారు సిరివెన్నెల సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి: జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా తన బాధ్యతని పేర్కొన్నారు. మనకున్నది పదిమందికీ పంచాలి- అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ రుద్రవీణలోని 'తరలిరాద తనే వసంతం..' అనే పాటలో వినిపించారని గుర్తుచేశారు. 'పంచే గుణమే పోతే - ప్రపంచమే శూన్యం... ఇది తెలియని మనుగడ కథ - దిశనెరుగని గమనము కద' అనే పంక్తులలోని భావాన్ని అందరం తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి సిరివెన్నెల సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలని సూచించారు.

ఆ రచనల్లో ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది: సీతారామ శాస్త్రి రచనలన్నిటిలో కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుందని కొనియాడారు. సమాజానికీ బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం వాటిలో నిక్షిప్తమై ఉంటుందన్నారు. ఆయన అక్షరాలు... నిత్య చైతన్య కిరణాలని, శాస్త్రి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ను మరింత అర్థం చేసుకొనేలా త్రివిక్రమ్ చేశారన్నారు. 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం' అందిస్తున్న 'తానా' బృందానికి పవన్​ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి:గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ

ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన

అందులో నటించనన్న సాయిపల్లవి.. బొమ్మరిల్లు భాస్కర్​తో చైతూ మూవీ!

ABOUT THE AUTHOR

...view details