తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతరిక్షంలో ఆంధ్రా అమ్మాయి అద్భుతం

చూస్తుంటే 2024 నాటికి జాబిల్లిపై అమ్మాయిలు అడుగుపెట్టడం ఖాయంఅనిపిస్తోంది. నాసా, బ్లూఆరిజన్‌, స్పేస్‌ఎక్స్‌ వంటి అంతరిక్ష సంస్థలు చందమామపై అమ్మాయిలని పంపించడానికి సర్వం సిద్ధం చేస్తున్నాయి.. ఈ సంవత్సరం అంతరిక్షంలో అమ్మాయిలు చేసిన అద్భుతాలు కూడా తక్కువేం కాదు... సీతా శొంఠి వంటి తెలుగు అమ్మాయిలు అంతరిక్షంలో అద్భుతాలు చేశారనే చెప్పాలి.

By

Published : Dec 20, 2020, 12:00 PM IST

it seems to be that women may go to space in 2024
అంతరిక్షంలో ఆంధ్రా అమ్మాయి అద్భుతం

సీత తండ్రి శ్రీరాం తూర్పు గోదావరిజిల్లాలోని రామచంద్రాపురం వాసి. ఆంధ్రయూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదివిన ఆయన తర్వాత కాలంలో అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి శారదా శొంఠి ప్రొఫెసర్‌. సీత అక్కడే జన్మించారు. తెలుగుని అమితంగా ప్రేమించే సీత పదిభాషలని అనర్గళంగా మాట్లాడటమే కాదు.. నాట్యం, సంగీతంలో సైతం ప్రతిభావంతురాలు. సోదరితో కలసి శొంఠి సిస్టర్స్‌ పేరుతో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. చిన్నవయసులోనే ఇరాక్‌ యుద్ధ సమయంలో అమెరికా తరఫున బాగ్ధాద్‌లో పనిచేసిన సీత... సుమారు పది దేశాల్లో అమెరికా ప్రతినిధిగా పనిచేసి ప్రస్తుతం స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్ష సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం అంతరిక్ష పరిశోధనల్లో సంచలనాలకి తెరతీసింది స్పేస్‌ ఎక్స్‌ సంస్థ. దాని ప్రధాన వ్యూహకర్తల్లో సీత శొంఠి ఒకరు. ఈ సంస్థ తొలిసారిగా నాసా నుంచి నలుగురు వ్యోమగాములని ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో క్రూడ్రాగన్‌ అనే హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ని అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లోకి పంపింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మిషన్‌హెడ్‌గా వ్యవహరించారీమె. ఇదే స్ఫూర్తితో మరికొన్ని కీలకమైన అంతరిక్ష ప్రయోగాలూ జరుగుతున్నాయి.

అమెరికా వైమానికదళంలో ‘45స్పేస్‌వింగ్‌’ విభాగానికి ఓ ప్రత్యేకత ఉంది. అంతరిక్ష ప్రయోగాలు చేసేటప్పుడు వాతావరణం అంతా బాగానే ఉందని ఈ సంస్థ పచ్చజెండా ఊపితేనే... రాకెట్లని అంతరిక్షంలోకి పంపిస్తారు. ఈసారి స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష సంస్థ పంపిన రాకెట్‌ లాంచింగ్‌కి పచ్చజెండా ఊపింది ఓ ‘ఆల్‌ఉమెన్‌’ బృందం కావడం విశేషం. వెదర్‌ డైరెక్టర్‌ కెప్టెన్‌ నాన్సీ జిమ్మర్‌మేన్‌ నేతృత్వంలో ఈ బృందం పనిచేసింది. రాకెట్లని పంపించడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులపై రిపోర్టులు ఇచ్చే బాధ్యత ఈ బృందానిదే. ఒకప్పుడు పురుషాధిక్య రంగం అనిపించుకున్న ఈ అంతరిక్ష పరిశోధన బృందంలోకి ఇలా పూర్తిగా అమ్మాయిలే వచ్చి విధులు నిర్వహించడం విశేషమే కదా!

అంతరిక్ష చరిత్రలో ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థకు ప్రత్యేకమైన పేజీ ఉంది. అంతరిక్షంలోకి కార్గొ, వ్యోమగాములని చేరవేస్తున్న మొదటి ప్రైవేట్‌ సంస్థగా సంచనాలకి కారణమైంది. అయితే ఈ సంస్థ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది ఓ మహిళ కావడం విశేషం. గైనీ షాట్‌వెల్‌ స్పేస్‌ఎక్స్‌కి సంబంధించిన అంతరిక్ష వ్యవహారాలు చూస్తుంటారు. స్పేస్‌క్రాఫ్ట్‌ డిజైన్‌లో ప్రత్యేకత సాధించిన గైనీ షాట్‌వెల్‌ ఈ ఏడాది ఫోర్బ్స్‌ టెక్‌ మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

నాసా 2024 నాటికల్లా చందమామపైకి మహిళని పంపించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఆర్టోమెస్‌ అనే ప్రాజెక్టులో భాగంగా అమెరికా ప్రభుత్వం 9 మంది మహిళా వ్యోమగాములని ఎంపిక చేసింది. ఫస్ట్‌ ఉమెన్‌ నెక్ట్స్‌మెన్‌ అనే నినాదందో నాసా ముందుకెళుతోంది. ఇంతకీ చందమామపై అడుగుపెట్టే ఆ మొదటి మహిళ ఎవరూ అనేగా మీ అనుమానం. అత్యధిక కాలం అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించిన క్రిస్టినాకోచ్‌, జెస్సికామెయిర్‌ వంటివారికి ఈ అవకాశం రావొచ్చని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్‌ సైతం చందమామపైకి ఒక అమ్మాయిని పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశామంటూ ప్రకటించడం విశేషం. జెఫ్‌బెజోస్‌ స్థాపించిన బ్లూఆరిజన్‌ సంస్థ చందమామపైకి పంపేందుకు బీఈ7 పేరుతో ఒక ఇంజిన్‌ని తయారుచేసింది. దీని సాయంతోనే చందమామపై మొదటి మహిళ అడుగుపెట్టబోతుందంటూ జెఫ్‌ ప్రకటించాడు.

ABOUT THE AUTHOR

...view details