ఐటీ గ్రిడ్ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక సిట్కు చేరింది. ఐటీగ్రిడ్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్డిస్క్లను విశ్లేషించిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు... ఏపీ, తెలంగాణ ప్రజల ఆధార్, వ్యక్తిగత సమాచారం సంస్థ వద్ద ఉన్నట్లు తేల్చింది. ఈ సమాచారం ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
వివరాలు ఎలా సేకరించారు..?
ఆధార్ సమాచారం ఎక్కడి నుంచి సేకరించారనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థ వద్దకు ఎలా చేరిందనే దానిపై ఇప్పటికే ఆధార్ సంస్థ అధికారులు మాదాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధార్ సంస్థతో పాటు... రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండే డేటా ప్రైవేట్ వ్యక్తుల వద్దకు ఎలా చేరిందనే దానిపైనే సిట్ దృష్టి సారించింది.
డేటా చౌర్యం జరిగింది
ఐటీ గ్రిడ్ సంస్థ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొని తెదేపాకు సేవామిత్ర అప్లికేషన్ సేవలు అందిస్తోంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు, ఐటీ గ్రిడ్ కార్యాలయంలో హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. నెల రోజులపాటు విశ్లేషించిన అధికారులు డేటా చౌర్యం జరిగినట్లు నిర్ధరించారు.
గాలింపు చర్యలు
ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ను పట్టుకునేందుకు సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. విచారణకు హాజరుకావాలని ఇప్పిటికే సిట్ మూడుసార్లు నోటీసులిచ్చినా అశోక్ స్పందించలేదు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే డేటా చౌర్యానికి సంబంధించిన కీలక సమాచారం బయటికి వచ్చే అవకాశముందని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు.
డేటా చౌర్యం జరిగినట్లు నిర్ధరించిన ఎఫ్ఎస్ఎల్ ఇవీ చూడండి: 'మీ రాజకీయాలకు నన్ను బలి చేయొద్దు'