తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా మరణాలతో నగర శ్మశానవాటికలకు పెరిగిన ఒత్తిడి - telangana varthalu

ఆప్తులను కోల్పోయిన దుఖం ఒకవైపు. కడసారి చూపునకు నోచుకోని ఆక్రందన మరోవైపు. తమవారిని కాపాడుకోలేదన్న బాధ. గౌరవంగా వీడ్కోలు పలకటంలేదన్న ఆవేదన. కరోనా మరణమృదంగం వేళ.... రాకాసి కాటుకు బలైన వారి కుటుంబాల గోడు హృదయవిదారకంగా మారుతోంది. వీటన్నింటిని మించి అంతిమ సంస్కారాల నిర్వహణ.... బాధితులకు మరింత కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లో శ్మశానవాటికలకు పెరిగిన ఒత్తిడితో... దహనసంస్కారాలకు మృతదేహాలను వరుసలో ఉంచాల్సిన దుస్థితి నెలకొంది.

corona deaths
కరోనా మరణాలతో నగర శ్మశానవాటికలకు పెరిగిన ఒత్తిడి

By

Published : May 11, 2021, 4:01 AM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా మరణాలు.. శ్మశానవాటికలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. శ్మశానవాటికలతోపాటు... విద్యుత్తు దహన వాటికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఈఎస్​ఐ, మహాప్రస్థానం, పంజాగుట్ట, అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, కవాడిగూడ, జల్‌పల్లి ఖబ్రస్థాన్‌లో మాత్రమే.. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు జీహెచ్​ఎంసీ అవకాశం కల్పించింది. అంబర్‌పేట, పంజాగుట్ట, బన్సీలాల్‌పేట, మహాప్రస్థానంలో విద్యుత్తు దహన వాటికలున్నాయి. పలు హిందూ శ్మశానవాటికల్లో కొవిడ్‌ మృతదేహాల కోసం పరిమిత సంఖ్యలో ఫ్లాట్‌పాంలను కేటాయించారు. అంతకంటే ఎక్కువ వస్తే అంత్యక్రియల నిర్వహణ కుదరదని అక్కడే తేల్చిచెబుతున్నారు. అంబర్‌పేట శ్మశాన వాటికలో 92 ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నా..... ఇందులో 17 మాత్రమే కొవిడ్‌ మృతదేహాల దహనానికి కేటాయించారు.

సంప్రదాయాల ప్రకారం

అప్పటికే దహనం చేసిన మృతదేహాల తాలూకు అస్థికలు, బూడిద ఉన్న కారణంగా... ఎక్కువ సంఖ్యలో దహనం చేయటంలేదు. సంప్రదాయాల ప్రకారం మూడు నుంచి ఐదు రోజులకు సంబంధీకులు వస్తున్నారు. కొందరేమో తీసుకెళ్లేందుకు రావడం లేదని.. దీంతో ఆ ఆస్థికలు, బూడిదను తామే తొలగించాల్సి వస్తుందని నిర్వహకులు వాపోతున్నారు. అంత్యక్రియల విషయంలో చాలా మందికి పట్టింపులు ఉంటాయని, వారి సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. విద్యుత్తు దహన వాటికల్లోనూ రోజుకు 8 నుంచి 10 మృతదేహాలను మాత్రమే దహనం చేస్తున్నారు. అంబర్‌పేటలోని దహనవాటికలో కొవిడ్‌ మృతదేహల అంత్యక్రియలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. బన్సిలాల్‌పేట, పంజాగుట్ట విద్యుత్తు దహన వాటికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి...

గతేడాది మే, జూన్‌ నెలల్లో కరోనా విజృంభించిన సమయంలోనూ వరసగా పలు మరణాలు సంభవించాయి. అప్పుడు స్థానికుల అభ్యంతరాలతో దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని జీహెచ్​ఎంసీ ప్రకటించింది. ఇందుకోసం కొన్నిచోట్ల స్థలాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కొన్నిచోట్ల గ్యాస్‌ దహన వాటికల ఏర్పాటుకు బల్దియా శ్రీకారం చుట్టింది. అయితే ఏడాది గడిచినా.. ఇప్పటికీ ఒక్క శశ్మానవాటిక కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. పటాన్‌చెరు, మూసాపేట, ఎల్‌బీనగర్‌లో కోటి రూపాయల వ్యయంతో గ్యాస్‌ దహన వాటికల నిర్మాణాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి, పటాన్‌చెరులో పనులు పూర్తైనా ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. పెరుగుతున్న మరణాల దృష్ట్యా దహన సంస్కారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రెండో దశలో వేగంగా పల్లెలను చుట్టుముడుతున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details