Agricultural land sales: స్థిరాస్తి రంగంలో జోరు కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.10 లక్షల దాకా ఉండగా, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో రూ. కోట్లలోనే పలుకుతున్నాయి. హైదరాబాద్తో ముడిపడిన రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎకరా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్లదాకా పలుకుతోంది. అయినా కొనేందుకు కొనుగోలుదారులు ముందుకొస్తుండటం, మంచి ధర లభిస్తుండటంతో అమ్మేందుకూ రైతులు సిద్ధమవుతున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా సుమారు మూడు రెట్లు పెరగడం గమనార్హం.
ఫాం లాండ్స్ సంస్కృతితో..ఇటీవల కాలంలో ఖాళీ స్థలాలతోపాటు, ఫాంలాండ్స్ (వ్యవసాయ భూములు), ఫాంహౌస్ల సంస్కృతి పెరిగింది. ధనవంతులు, ఉన్నతోద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వంటి వారు ఆర్థిక స్తోమతను బట్టి నగర శివార్లలో ఎకరా, అర ఎకరా చొప్పున కొనుగోలుచేసి ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. భూముల అమ్మకాల్లో జోరుకు ఇది కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్నగర్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఈ తరహా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలోని సదాశివపేట, 130 కిలోమీటర్లు దూరంలో కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణ్ఖేడ్ వంటి ప్రాంతాల్లో ఫాంలాండ్స్ పేరిట వ్యవసాయ భూముల్ని పావు ఎకరం, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారని’ ఉదహరిస్తున్నారు.
రాబడికి భరోసా..మారిన పరిస్థితుల దృష్ట్యా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పెట్టుబడిగా భూములను ఎంచుకోవడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకోవడం, బంగారం కొనుగోలు, వడ్డీ వ్యాపారాల కంటే భూములపై రాబడి అధికంగా ఉంటోంది. దీంతో వేలమంది దీన్ని నమ్మకమైన పెట్టుబడిగా భావిస్తూ ఇళ్ల స్థలాలు, భూముల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో సాగునీటి లభ్యత పెరగడంతో కాస్త స్తోమత ఉన్న రైతులు వ్యవసాయ భూముల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. బయటి ప్రాంతాల రైతులూ ఇక్కడ సాగుభూముల కొనుగోళ్లు జరుపుతున్నారు. క్రయవిక్రయాల్లో వృద్ధి కొనసాగడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి’అని నిపుణులు పేర్కొంటున్నారు.