రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదు రూపాయలకే ఆహారాన్ని అందించే వినూత్న కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారమే ప్రారంభించాలని తొలుత నిర్ణయించినా.. సాంకేతిక కారణాలతో ఒకట్రెండు రోజులు వాయిదా వేసినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. దీన్ని గాంధీ, నిలోఫర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఏదో ఒక చోట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి.
కార్యక్రమానికి పేరు పరిశీలన..
ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. ఈ కార్యక్రమానికి ‘కేసీఆర్ ఆహారామృతం’, ‘కేసీఆర్ భోజనామృతం’, ‘కేసీఆర్ అన్నామృతం’ తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ పేర్లలోనే ఒక పేరును ఎంపిక చేస్తారా? మరో కొత్త పేరును ముఖ్యమంత్రి సూచిస్తారా? అనేది ఇప్పటి వరకూ స్పష్టత లేదని పేర్కొన్నాయి.
మొదట 18 ఆస్పత్రుల్లో..
ఈ కార్యక్రమాన్ని తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. ఉస్మానియా, నిలోఫర్, సరోజినీదేవి, పేట్లబురుజు, గాంధీ, ఎంఎన్జే, ఛాతీ ఆసుపత్రి, ఈఎన్టీ, సుల్తాన్బజార్ ప్రసూతి దవాఖానా, నిమ్స్, ఫీవర్, టిమ్స్, కింగ్కోఠి జిల్లా ఆసుపత్రి, మలక్పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్, నాంపల్లి ప్రాంతీయ ఆసుపత్రుల్లో రూ.5కే ఆహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ‘హరే కృష్ణ మూవ్మెంట్’ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.