తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా.. నిలదీసేవారిపై దాడులు - Illegal sand mining in wanaparthy district

గోదావరి, కృష్ణా వంటి ప్రధాన నదులు.. మూసీ, మంజీరా వంటి ఉపనదులు, వాగుల నుంచి అక్రమంగా తోడేస్తున్న ఇసుకతో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో దందా పెద్దఎత్తున సాగుతోంది. ప్రజల అవసరాల్ని ఇసుకాసురులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కొందరు ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా నిలుస్తోండడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.

sand mafia, sand mafia in telangana, sand mining in telangana
ఇసుక మాఫియా, తెలంగాణలో ఇసుక మాఫియా, తెలంగాణలో ఇసుక దందా

By

Published : Apr 19, 2021, 7:16 AM IST

మూసీ నుంచి నిత్యం 100-150 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. భూగర్భజలాలు పడిపోతున్నాయి..రోడ్లు ఛిద్రమవుతున్నాయి..నిరంతరం ఇసుక ట్రాక్టర్ల సంచారంతో నిద్ర కరువవుతోంది.. ఊపిరితిత్తుల్లోకి ధూళికణాలు చేరుతున్నాయి.. అక్రమాల్ని అడ్డుకోవాల్సిన, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు మామూళ్లు గుంజుతూ దందాను ప్రోత్సహిస్తున్నారు. అధికారులే కాపాడాలి’’

- ఇది సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలోని ఉయ్యాలవాడ గ్రామస్థుల ఆవేదన

రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, మూసీ, మంజీరా వంటి నదులు, మరికొన్ని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇసుక అక్రమరవాణాను అడ్డుకుంటున్నారని ఇటీవలే మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలో ఇద్దరు యువకుల్ని చితకబాదిన అక్రమార్కులు ఓ యువకుడిపై కత్తితో దాడిచేయడం ఇసుక మాఫియా అరాచకాలకు అద్దం పడుతోంది.

రూ.లక్షల్లో మామూళ్లు

గోదావరిపై మంచిర్యాల జిల్లాలో 8 ఇసుకరీచ్‌లు ఉన్నాయి. లారీల్లో పరిమితికి మించి ఇసుక నింపి గుత్తేదారులు సొమ్ము చేసుకుంటుంటే.. ఓవర్‌లోడ్‌ కేసులు పెట్టకుండా అధికారులు సహకరిస్తున్నారు. ఇక్కడ ఒక్కో గుత్తేదారు రూ.30వేల చొప్పున నెలకు రూ.2.40 లక్షలు ఓ కీలకశాఖకు చెందిన నాలుగు మండలాల అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో కోటపల్లి నుంచి 30 ఇసుక లారీలు ఓవర్‌లోడుతో వెళ్లాయి. మంచిర్యాల జిల్లా సరిహద్దులు దాటే వరకు సాఫీగా సాగిపోయాయి. వాటిని పక్క జిల్లా కరీంనగర్‌లో ఆర్టీఏ అధికారులు పట్టుకుని సీజ్‌ చేయడం గమనార్హం.

కీలక నేతల నుంచి ఒత్తిళ్లు

  • ఇసుక అక్రమ రవాణా విషయంలో దక్షిణ తెలంగాణలోని ఒకజిల్లాలో కీలక ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిడి ఉంది.
    కేసులు పెడుతూ వెళితే ఇసుక ధరలు పెరిగి..ప్రజలపై భారం పడుతుందంటూ సూచనతో కూడిన హెచ్చరికలు వెళ్లాయి. ఈ క్రమంలో దాడులు నామమాత్రం చేసిన అధికారులు ఇసుకాసురుల నుంచి ట్రిప్పులు, నెలవారీగా వసూళ్లు మొదలుపెట్టారు.
  • మహబూబాబాద్‌ జిల్లాలో నెల్లికుదురు, తొర్రూరు, నర్సింహులపేట, తదితర మండలాల్లో ఆకేరు వాగు నుంచి 20 ఏళ్లుగా ఇసుకను తోడేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెక్‌డ్యాంలు దెబ్బతినడంతో రెండు పంటలకు నీరందించే వాగు వానాకాలం పంటకే పరిమితమైంది. వాగులో ఇసుక తవ్వకాలపై రెవెన్యూశాఖ జారీచేసిన కూపన్లను కలెక్టర్‌ రద్దు చేయించినా అది తాత్కాలికమే అయింది. తర్వాత ఓ నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి జోక్యంతో కూపన్ల జారీ మళ్లీ మొదలైంది. అవి కూడా ఆ ప్రజాప్రతినిధి అనుచరులకే ఇస్తున్నారు.
  • వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం నుంచి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు, పెద్దవంగర ప్రాంతాలకు ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అరికట్టాల్సిన పోలీసులు ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

పోలీస్‌స్టేషన్ల ముందు నుంచే

రాత్రి సమయాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండవు. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుందుభి వాగులో రాత్రి 10 గంటల నుంచి ఇసుకను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పెద్దవాగు వెంబడి ఇసుక రీచ్‌లను కొందరు నేతలు పంచుకున్నారు. జడ్చర్ల, రాజాపూర్‌, బాలానగర్‌, మక్తల్‌, మరికల్‌, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, మూసాపేట, అడ్డాకుల, జడ్చర్ల పోలీసుస్టేషన్ల ముందు నుంచి హైదరాబాద్‌కు రాత్రివేళల్లో ఇసుక తరలిపోతున్నా పట్టించుకోవడంలేదు.

రెండు ప్రభుత్వ విభాగాల్లో ఒక శాఖకు నెలకు ఒక్కో ట్రాక్టరు మీద రూ.2,000 మరో శాఖకు రూ.1,000 చొప్పున మామూళ్లు అందుతున్నట్లు సమాచారం.

సమన్వయంతోనే అడ్డుకట్ట

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడాలంటే రెవెన్యూ, గనులు భూగర్భ, పోలీస్‌ శాఖలు సమన్వయంతో సాగాలి. లారీ లోడ్‌ కాకుండా ఐదారు, పది టన్నుల వరకు తక్కువ పరిమాణంలోనూ ఇసుక లభించాలి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఉన్నట్లు జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీఎస్‌ఎండీసీ సబ్‌స్టాక్‌ యార్డులు ఏర్పాటుచేయాలి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రజలకు ఇబ్బందీ తప్పుతుంది.

నేతలకు ప్రధాన వనరు

సూర్యాపేట జిల్లాలో మూసీ పరీవాహక గ్రామాల్లో ఇసుక దందాలో వివిధ పార్టీల నాయకుల పాత్ర ఉంది. వీరికి ట్రాక్టర్లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఇసుకే వీరికి ప్రధాన ఆదాయ వనరు. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం మండలాల నుంచి ఇసుక భారీగా తరలిపోతోంది. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే బెదిరింపులు, దాడులు తప్పవు. మూసీ నుంచి ఐదారు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో ట్రాక్టర్‌ ఇసుక ధర కొన్నాళ్ల క్రితం రూ.1,800 ఉండేది. ఇప్పుడేమో రూ.2,500కి పెంచేశారు. 30 కి.మీ. దూరంలోని సూర్యాపేట వంటి ప్రాంతాల్లో ధర రూ.4,000 పైమాటే.

సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2020లో మూడొందల ఇసుక ట్రాక్టర్లపై.. 2021లో 46 వాహనాలపై కేసులు నమోదయ్యాయి. అప్పుడప్పుడు దృష్టిపెడితేనే ఈ సంఖ్య. ఇసుక అక్రమ రవాణాలో ప్రతి ట్రాక్టర్‌ ట్రిప్పుకి రూ.500 వసూలుచేస్తున్నట్లు తెలుస్తోంది.

సర్కారు ఆదాయానికి గండి

భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో 14 ఇసుక రీచ్‌లున్నాయి. బుకింగ్‌కు విరుద్ధంగా లారీల్లో అదనంగా 4-8 టన్నుల ఇసుక నింపుతున్నారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌లో క్యూబిక్‌ మీటరుకు రూ.600లు చెల్లించాలి. ఒక్కో లారీలో 2 క్యూబిక్‌ మీటర్లు అదనంగా ఇసుక నింపినా రూ.1200 వరకు ప్రభుత్వానికి రావాలి. కానీ, ఈ ఆదాయం పక్కదారి పడుతోంది. ఇలా రోజుకు 100 లారీల్లో కనీసం 2 క్యూబిక్‌ మీటర్ల చొప్పున అదనంగా నింపినా రూ.1.20 లక్షల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. భూపాలపల్లి, కాటారం మండలాల్లో మూడున్నర నెలల్లో 40 లారీలు అదనపు లోడుతో పట్టుబడ్డాయి.

గోదావరికి పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లాలో ట్రాక్టర్‌ ఇసుక 5-7వేలు పలుకుతోంది. సామాన్యులకు అందని ద్రాక్షే అయింది.

ABOUT THE AUTHOR

...view details