తెలంగాణ

telangana

క్రమబద్ధీకరణపై కబ్జాదారుల కన్ను..సర్కార్ భూముల్లో అక్రమ నిర్మాణాలు

అదను చూసి కొందరు ఆక్రమణదారులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాలను కాజేసేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికార యంత్రాంగం ఆస్తుల నమోదు ప్రక్రియలో తలమునకలై ఉండడంతో ఆక్రమణదారులు పేట్రేగుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే పేదలు నివసిస్తుంటే వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

By

Published : Oct 11, 2020, 6:21 AM IST

Published : Oct 11, 2020, 6:21 AM IST

Illegal constructions in government land in Hyderabad
సర్కార్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు

ఆస్తుల నమోదు ప్రక్రియలో రాష్ట్రం అంతటా మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగం తలమునకలై ఉంది. పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది ఆస్తుల నమోదు సందర్భంగా కొత్తగా నిర్మించుకున్న గృహాలు, ఇంటి నంబర్లు కేటాయించనివి, ఆస్తుల విలువ లెక్కించని వాటి విషయంలో దృష్టి పెడుతున్నారు. మున్సిపల్‌ సిబ్బంది అంతా తీరక లేకుండా ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో నివాసాల లెక్కలు నమోదు చేస్తున్నారు. ఇలా యంత్రాంగం దృష్టంతా ఆస్తుల నమోదుపైనే ఉండటంతో కబ్జాదారులు తెగిస్తున్నారు. తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు క్రియాశీలకంగా ఉన్న ప్రాంతాల్లో కబ్జాలు, నిర్మాణాలను కొంత వరకు కట్టడి చేస్తున్నారు.

సమాచారం అందించే వ్యవస్థ లేకనే...

క్షేత్రస్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న నిర్మాణాల సమాచారం సకాలంలో పై స్థాయి అధికారులకు అందడం లేదు. భూ దస్త్రాలు, ప్రభుత్వ భూముల వివరాలకు సంబంధించిన దస్త్రాలను వీఆర్వోలు ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో క్షేత్రస్థాయిలో భూముల పర్యవేక్షణకు ప్రత్యేకంగా వ్యవస్థ లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం కొందరు ఆక్రమణదారులకు అవకాశంగా మారిందని చెబుతున్నారు.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ప్రభుత్వ భూమిలో వెలసిన భవన నిర్మాణాలను అధికారులు ఇటీవల కూల్చివేసిన దృశ్యమిది. రూ.కోట్లు విలువైన ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ పిల్లర్లతో పక్కా భవన నిర్మాణం చేపట్టారు. ఉప్పల్‌ ప్రధాన రహదారి సమీపంలోనూ రూ.5 కోట్ల విలువైన భూమిలో కొందరు పక్కా నిర్మాణాలు చేపట్టగా సమాచారం అందుకున్న అధికారులు కూల్చివేశారు. గాజుల రామారం పరిధిలో కూడా ఇలాంటి కూల్చివేతలు జరిగాయి.

జీవో ఎంఎస్‌ 58, 59లు ఏం చెబుతున్నాయంటే...

జీవో ఎంఎస్‌. 58 02.06.2014కు ముందు 125 గజాల లోపు ప్రభుత్వ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు క్రమబద్ధీకరణకు అర్హులు. వీరికి ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. దీని కింద 3.46 లక్షల దరఖాస్తులు అందగా 91,639 పట్టాలు జారీ చేశారు. 71.97 లక్షల చదరపు గజాలను క్రమబద్ధీకరించారు.

జీవో ఎంఎస్‌.59 02.06.2014కు ముందు 250 చదరపు గజాల స్థలంలో ఆక్రమణ ఉంటే మార్కెట్‌ విలువలో 50 శాతం రుసుంతో, 500 చదరపు గజాల స్థలంలో ఉంటే మార్కెట్‌ విలువలో 75% విలువ, 500 చదరపు గజాలకు పైబడి ఉంటే మార్కెట్‌ విలువ ప్రకారం వసూలు చేసి క్రమబద్ధీకరించింది. ఈ జీవో కింద 29,557 మంది దరఖాస్తు చేసుకోగా 13,498 మందికి క్రమబద్ధీకరణ చేపట్టారు.

ఇవి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి సిద్ధం చేసిన రాళ్లు. బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణల పాలవుతోంది. క్రిష్టియన్‌పల్లి సర్వే నెంబర్‌ 523లో ఈ దందా సాగుతోంది. కొందరు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, దళారులు కలిసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. దాదాపు 73 ఎకరాలున్న ప్రభుత్వ స్థలంలో రూ.4 లక్షలకు ఒక ప్లాటు చొప్పున విక్రయాలకు తెగబడుతున్నారు. ఇదే అదనుగా కొందరు రెవెన్యూ సిబ్బంది దొంగ పట్టాలు జారీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details